ఆర్టికల్ 370 రద్దు.. కాశ్మీర్ విభజనకు కారణం ఆయనేనా?
ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దైంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విడదీసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రం జమ్ము కాశ్మీర్, లడాఖ్గా విడిపోనుంది. అయితే మోడీ సర్కారు ఇంత హడావిడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకాశ్మీర్ విభజన నిర్ణయానికి కారకులెవరు?
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటన.. కాశ్మీర్ విషయంలో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో మోడీ అప్రమత్తమైంది. ఆ నిమిషం నుంచి కాశ్మీర్ విషయంలో అనూహ్య మలుపులు జరుగుతూనే ఉన్నాయి. విభజన అనంతరం కీలక సమస్యగా మారిన కాశ్మీర్ గురించి రెండు దేశాల మధ్య యుద్ధం కూడా జరిగింది. ఇటీవల అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అగ్గి రాజేశారు. ఆయన చేసిన ప్రకటనతో ఏదో జరగబోతోందని పసిగట్టిన మోడీ, అమిత్ షా ద్వయం రంగంలోకి దిగారు. తక్షణమే నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఆర్టికల్ 370 రద్దుపై భగ్గుమన్న విపక్షాలు.. భారత ప్రజాస్వామ్యంలో చీకటి రోజన్న ముఫ్తీ
గత నెలలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు వెళ్లాడు.. ఆ సందర్భంగా ట్రంప్ కాశ్మీర్ సమస్యకు తానే పరిష్కారం చూపుతానన్న రీతిలో మట్లాడాడు. పాకిస్థాన్ కూడా ట్రంప్ మాటలకు వంతపాటింది. అయితే ట్రంప్ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించిన భారత్ కాశ్మీర్ విషయంలో ఎవరి జోక్యం అవసరంలేదని స్పష్టం చేసింది. ట్రంప్ ప్రకటనతో అప్రమత్తమైన మోడీ సర్కారు వ్యూహాలకు పదును పెట్టింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ను కాశ్మీర్కు పంపింది. రెండు రోజుల అనంతరం భారీగా భద్రతాబలగాలను కాశ్మీర్కు తరలించారు. నిత్యం రావణకాష్టంలా రగిలే కాశ్మీర్లో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ లాంటి వాళ్లను హౌస్ అరెస్ట్ చేసి చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపేసిన కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్పై చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
మొత్తమ్మీద అతి సున్నితమైన సమస్యకు మోడీ, అమిత్ షా ద్వయం భిన్నమైన రీతిలో ముగింపు పలికారు. కాశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి సమస్యకు సరికొత్త పరిష్కారం చూపారు. విభజన బిల్లు ఉభయ సభల్లో పాసై రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారనున్నాయి. లోయలో హింస తగ్గి ప్రశాంత వాతావరణం నెలకొననుంది.