రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం, రెబల్ ఎమ్మెల్యేని కాపాడుతున్న గవర్నర్ ? రూ. 400 కోట్లు !
బెంగళూరు: రూ. వేల కోట్ల ఐఎంఏ చీటింగ్ స్కాంలో అరెస్టు అయిన మన్సూర్ ఖాన్ ను అధికారులు విచారణ చేస్తున్న సమయంలో నిందితుడు ఆరోపించిన కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరు నగరంలోని శివాజీనగర్ అనర్హత ఎమ్మెల్యే రోషన్ బేగ్ ను ఆ రాష్ట్ర గవర్నర్ వాజూబాయ్ వాలా రక్షించడానికి ప్రయత్నిస్తున్నారా? అనే విషయం అంతు చిక్కడం లేదు. గవర్నర్ ప్రత్యేక దర్యాప్తు సంస్థ (ఎస్ఐటీ) చీఫ్ రవికాంత్ గౌడకు రాశారు అంటున్న ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం మన్సూర్ ఆలీ ఖాన్ ను సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.
ఆదాని కంపెనీకి నీకు ఏం సంబంధం ఐశ్వర్య, డీకే కూతురుకు ఈడీ ప్రశ్నలు, ఉషా ఆస్తి!
గవర్నర్ లేఖలో ఏం ఉంది !
గవర్నర్ వాజూబాయ్ వాలా ఎస్ఐటీ అధికారి రవికాంత్ గౌడకు రాశారు అంటున్న లేఖలో మాజీ మంత్రి రోషన్ బేగ్ స్వతంత్రంగా సంచరించడానికి అవసరం అయిన అవకాశం ఇవ్వాలని జూలై 17వ తేదీన సూచించారని తెలిసింది. జులై 16వ తేదీ రాత్రి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శివాజీనగర్ రెబల్ ఎమ్మెల్యే (కాంగ్రెస్)ను విచారణ పేరుతో డీసీపీ గిరీష్ ఆధ్వర్యంలోని అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. రోషన్ బేగ్ ను ఎస్ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్న మరుసటి రోజు గవర్నర్ వాజూబాయ్ వాలా ఎస్ఐటీ అధికారులకు లేఖ రాశారని వెలుగు చూసింది.
రోషన్ బేగ్ కు రూ. 400 కోట్లు లంచం ?
ఐఎంఏ జ్యూవెలర్స్ సంస్థ స్కాంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు, ఈ కేసు ప్రధాన నిందితుడు మన్సూర్ ఆలీ ఖాన్ అరెస్టు కాకముందే మాజీ మంత్రి రోషన్ బేగ్ మీద సంచలన ఆరోపణలు చేశారు. రోషన్ బేగ్ ఐఎంఏ సంస్థ నుంచి రూ. 400 కోట్లు లంచం తీసుకున్నారని అప్పటి బెంగళూరు నగర పోలీసు కమిషనర్ టీ. సునీల్ కుమార్ కు 2019 జూన్ 9వ తేదీ పంపించిన ఆడియోలో మన్సూర్ ఆలీ ఖాన్ ఆరోపణలు చేశారు.
చంపేస్తామని వార్నింగ్ !
లోకల్ రౌడీలతో రోషన్ బేగ్ నన్ను చంపేస్తానని బెదిరించారని, తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆ వీడియోలో మన్సూర్ ఆలీ ఖాన్ సంచలన ఆరోపణలు చేశాడు. తాను 14 రోజుల నుంచి సౌదీలో ఉన్నానని, మీరు రక్షణ కల్పిస్తామని భరోసా ఇస్తే భారత్ తిరిగి వస్తానని మన్సూర్ ఆలీ ఖాన్ 2019 జూన్ 22వ తేదీ మరో ఆడియో విడుదల చేశాడు. తన దగ్గర శివాజీనగర్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ రూ. 400 కోట్లు తీసుకున్నారని ఐఎంఏ నిందితుడు మన్సూర్ ఆలీ ఖాన్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు.
రూ. 600 కోట్లకు క్లీన్ చిట్ !
ఐఎంఏ స్కాంకు సంబంధించి రూ. 400 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శివాజీనగర్ రెబల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోషన్ బేగ్ ను అధికారులు ఇంత వరకూ పూర్తి స్థాయిలో విచారణ చెయ్యలేదు, అరెస్టు చెయ్యలేదు. ఈ విషయంపై ఇటీవల మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆర్ వీ. దేశ్ పాండ్ మాట్లాడుతూ ఎవరు ఏ తప్పు చేసినా సరే శిక్ష అనుభవించాలని అన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులను విచారణ చెయ్యాలని ఆర్. వీ. దేశ్ పాండ్ డిమాండ్ చేశారు. నిందితుడు మన్సూర్ ఆలీ ఖాన్ ను రోషన్ బేగ్ అప్పటి మంత్రి ఆర్ వీ. దేశ్ పాండే దగ్గరకు పిలుచుకుని వెళ్లి ఆర్ బీఐ నుంచి రూ. 600 కోట్లు రుణం తీసుకోవడానికి సంకీర్ణ ప్రభుత్వం నుంచి క్లీన్ చిట్ ఇప్పించారని ఆరోపణలు ఉన్నాయి.
బీజేపీలో చేరడానికి బేగ్ కు చెక్ !
నేను అనర్హత ఎమ్మెల్యే అయినా హజ్ కమిటి అధ్యక్షుడు అని రోషన్ బేగ్ అంటున్నారు. ప్రతిరోజూ తాను హజ్ యాత్రికుల సమస్యలు పరిష్కరించాలని, ఎస్ఐటీ అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని రోషన్ బేగ్ చెప్పారు. సరైన సమాచారం లేకపోవడంతో తాను పూణే వెలుతున్న సమయంలో తనను ఎస్ఐటీ అధికారులు బెంగళూరు ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకుని విచారణ చేశారని రోషన్ బేగ్ అన్నారు. బెంగళూరులోని శాసన సభ్యుల సహాయంతో మాజీ మంత్రి ఎంజే. అక్బర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీని సంప్రధించిన రోషన్ బేగ్ బీజేపీలో చేరడానికి విఫలయత్నం చేశారు. అయితే రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రోషన్ బేగ్ బీజేపీలోకి చేరడానికి ఆర్ఎస్ఎస్ చెక్ పెట్టిందని సమాచారం.