అమ్మ జయలలిత అనుమానాస్పద మృతి: పెరోల్ కు శశికళ పక్కా ప్లాన్: జైల్లో, సొంత పనుల కోసం!
బెంగళూరు/చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె నెచ్చలి వీకే. శశికళ స్వయంగా విచారణకు హాజరుకావాలని ఆలోచిస్తున్నారని తెలిసింది. జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఆమెకు ఎలాంటి చికిత్స అందించారు అంటూ విచారణ కమీషన్ ముందు శశికళ వివరించనున్నారని తెలిసింది. అందుకోసం జైలు నుంచి బయటకు రావడానికి శశికళ పక్కాప్లాన్ వేశారని ఆమె వర్గీయులు చర్చించుకుంటున్నారు.
సీఎం పళనిస్వామి ఆదేశాలు
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతి కేసు విచారణ చెయ్యాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి ఏకసభ్య విచారణ కమీషన్ కు ఆదేశాలు జారీ చేశారు.
శశికళ ఫ్యామిలీ
జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో శశికళ, ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే అక్కడ ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. తమిళనాడు మంత్రులు, ఏఐఏడీఎంకే పార్టీ నాయకులు సైతం జయలలితను చూడలేదని విమర్శలు ఉన్నాయి. ఇదే విషయంలో అన్నాడీఎంకే పార్టీ నాయకులు శశికళను బహిరంగంగా విమర్శించారు.
శశికళ ఆదేశాలు
జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తాము చూశామని, అమ్మ త్వరగా కోలుకుంటారని అప్పట్లో కొందరు మంత్రులు, అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకులు మీడియా ముందు చెప్పారు. అయితే చిన్నమ్మ వీకే. శశికళ ఆదేశాల మేరకే అప్పట్లో కొందరు మంత్రలు, అన్నాడీఎంకే పార్టీ నేతలు మీడియా ముందు అలా చెప్పారని ఆరోపణలు ఉన్నాయి.
లాయర్ అభ్యంతరాలు
మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కొందరిని విచారణ చేసే సమయంలో శశికళకు చెందిన న్యాయవాది క్రాస్ ఎగ్జామ్ చేశారు. శశికళకు వ్యతిరేకంగా సాక్షం చెప్పిన వారికి ఆమె న్యాయవాది అనేక ప్రశ్నలు వేశారని సమాచారం. జయలలిత అనుమానాస్పద మృతి విషయంలో శశికళను స్వయంగా విచారణ చేసి వివరాలు సేకరించాలని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమీషన్ ఇప్పటికే నిర్ణయించింది.
జైల్లో విచారణ
జయలలిత అనుమానాస్పద మృతి విషయంలో బెంగళూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళను విచారణ చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ కమీషన్ లేఖ రాసింది. జైల్లోనే శశికళను విచారణ చేసి ఆమె వాంగ్మూలం రికార్డు చేసుకోవాలని ఆర్ముగస్వామి విచారణ కమీషన్ సిద్దం అయ్యింది.
శశికళ పక్కా ప్లాన్
జయలలిత అనుమానాస్పద మృతి విచారణ కమీషన్ ముందు స్వయంగా హాజరుకావాలని శశికళ నిర్ణయించారని తెలిసింది. విచారణకు హాజరుకావడానికి పెరోల్ మంజూరు చెయ్యాలని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులకు శశికళ అర్జీ సమర్పించారని తెలిసింది.
మూడోసారి పెరోల్
భర్త నాటరాజన్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సమయంలో వీకే. శశికళ పెరోల్ మీద బయటకు వచ్చారు. చికిత్స విఫలమై నటరాజన్ మరణించిన తరువాత ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడానికి శశికళ మరోసారి పెరోల్ మీద బయటకు వచ్చారు. ఇటీవల ఇళవరసి సోదరుడు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సమయంలో శశికళ పెరోల్ మీద బయటకు రావాలని ప్రయత్నించడంతో జైళ్ల శాఖ అధికారులు అభ్యంతరం చెప్పారు. ఇప్పుడు జయలలిత అనుమానాస్పద మృతి విషంలో విచారణ కమీషన్ ముందు హాజరుకావడానికి శశికళ మరోసారి పెరోల్ కు అర్జీ సమర్పించారని తెలిసింది.