ఆనంద్తో పెళ్లి, ఈషా అంబానీకి కానుకగా రూ.450 కోట్ల భవనం: ఎన్నో వసతులు
ముంబై: రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ-నీతా అంబానీల కూతురు ఈషా అంబానీ వివాహ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. పిరమాల్ వారసుడు ఆనంద్ పిరమాల్తో ఆమె పెళ్లి డిసెంబర్ 12న జరగనుంది. పెళ్లికి మరో నెల రోజులు కూడా లేదు. దీంతో వివాహ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. వైభవంగా జరగబోయే ఈ వివాహానికి బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరవుతారు.
ఈ వివాహ ఆహ్వానానికి సంబంధించిన వీడియో ఒకటి ఇటీవలి వరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడట్టింది. వీడియోలో చూపించినట్లు ఆహ్వాన పత్రికను పెద్ద డిజైనర్ బాక్స్లో ఉంచి దాని మీద ఐఏ(ఈశా, ఆనంద్) అనే అక్షరాలను పొందుపర్చారు. బాక్స్ తెరవగానే అందులో డైరీ రూపంలో ఉన్న ఆహ్వాన పత్రిక ఉంటుంది. దానిని తెరిస్తే తొలుత గాయత్రిదేవీ మంత్రం రాగం వినిపిస్తుంది. అనంతరం శ్రీకృష్ణుడి ఫొటో కనిపిస్తుంది. నాలుగో పేజీలో శుభ్ అభినందన్ పేరుతో ఈశా, ఆనంద్ రాసిన లేఖ ఉంటుంది. ఇందులో మిగతా అంతా వధూవరుల కుటుంబ సభ్యుల పేర్లు, సన్నిహిత బంధువుల పేర్లు ఉంటాయి. పత్రిక ఖరీదు రూ.3 లక్షలకు పైగా ఉంటుందట. వివాహ పత్రిక సంగతి పక్కన పెడితే, ఇషా అత్తింటి వారు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు.
రూ.450 కోట్ల భవనం
ఈషా అంబానీ, ఆనంద్ పిరమిల్లకు ముంబైలో సముద్రపు ముఖం ఉన్న భారీ బంగ్లాను బహుమతిగా ఇచ్చారు. పెళ్లి జరిగిన తర్వాత వారు అందులో ఉండనున్నారు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో పిరమాల్ కుటుంబం పేరిట ఉన్న రూ.450 కోట్ల విలువైన గులీటా భవనాన్ని అజయ్, స్వాతి పిరమాల్ దంపతులు ఈశా-ఆనంద్ జంటకు కానుకగా ఇవ్వనున్నారు.
కొత్త ఇంటిలోకి అడుగు
డిసెంబర్ 12న వివాహం అనంతరం నూతన దంపతులు ఇదే భవనంలో ఉంటారు. వర్లీలోని హిందుస్థాన్ యూనిలీవర్కు చెందిన ఈ భవనాన్ని 2012లో జరిగిన వేలంలో పిరమాల్ కుటుంబం దక్కించుకొంది. అప్పటి నుంచి దీన్ని వివిధ రకాల శిక్షణ కేంద్రాలకు వినియోగిస్తున్నారు. ఇది అయిదు అంతస్తుల భవనం. భవనం అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉంటుంది. ఆరేళ్ల క్రితం వేలంలో దక్కించుకున్నా పూర్తి హక్కులు మాత్రం ఈ సెప్టెంబర్ 19న బదిలీ అయ్యాయి.
భవనంలో ఎన్నో వసతులు
ముంబైలో అత్యంత పేరున్న భవనమం యాంటిలియానే. ఇప్పుడు గులీటా కూడా ఈ జాబితాలో చేరనుంది. గులీటా 50,000 చ.అ. విస్తరించి ఉంది. ఈ భవనంలోని మొదటి అంతస్తులో విశాలమైన లాన్, మల్టీ పర్పస్ రూంలు, ఓపెన్ ఎయిర్ వాటర్ బాడీ సదుపాయాలు ఉంటాయి. మిగతా అంతస్తుల్లో లివింగ్ రూమ్, డిన్నర్ రూమ్, బెడ్ రూమ్స్, ట్రిపుల్ హైట్ మల్టీ పర్పస్ రూంలు, లాంజ్ ఏరియాలు, డ్రెస్సింగ్ రూమ్లు ఉన్నాయి. పని చేసే వారికి క్వార్టర్స్ కూడా అక్కడే ఉంటాయి. డిసెంబర్ 1న ఈ భవనంలో పూజలు నిర్వహించి, వివాహం అనంతరం డిసెంబర్ 12న కొత్త దంపతులు ఈ ఇంట్లోకి ప్రవేశిస్తారు.
ఈషా, ఆనంద్ల పెళ్లి
కాగా, ఈ ఏడాది మే నెలలో ఈషా, ఆనంద్ల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని ముకేశ్ అంబానీ నివాసంలో అత్యంత వైభవంగా ఈ వేడుక జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఇటలీలోని లేక్ కోమో వేదికగా వీరిద్దరి నిశ్చితార్థం మూడు రోజుల పాటు ఘనంగా జరిగింది.