ఘనంగా ఈశా అంబానీ-ఆనంద్ నిశ్చితార్థం, నీతా నృత్యం ప్రత్యేకం, ప్రముఖుల హాజరు
Recommended Video
ముంబై: భారత కుబేరుడు, రిలియన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. తన గారాలపట్టి ఈశా వివాహం నిశ్చయం కావడంతో అంబానీ కుటుంబం సంబరాల్లో మునిగి తేలుతోంది.
లవ్ ప్రపోజల్కు ఓకే: ఈశా అంబానీకి కాబోయే భర్త ఇతడే, ఎవరో తెలుసా?
ఈ ఆనందాన్ని రెట్టింపు చేసుకునేందుకు సోమవారం రాత్రి ఘనంగా నిశ్చితార్థ విందు ఏర్పాటుచేశారు ముకేశ్, నీతా దంపతులు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్, క్రికెట్ ప్రముఖులు హాజరయ్యారు.
రెండ్రోజుల క్రితమే
ముకేశ్ తనయ ఈశా అంబానీ.. ప్రముఖ యువ వ్యాపారవేత్త, పిరమాల్ సంస్థల వారసుడు ఆనంద్ పిరమాల్ను త్వరలో పెళ్లిచేసుకోనున్నారు. రెండు రోజుల క్రితమే ఈ వార్త బయటకొచ్చింది. కాగా, ఈషా అంబానీ, ఆనంద్ పిరమాల్ల ఎంగేజ్మెంట్ పార్టీని ముఖేష్ అంబానీ ఫ్యామిలీ సోమవారం ఘనంగా నిర్వహించింది.
ప్రముఖుల హాజరు
ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ ప్రముఖులు షారూక్ఖాన్, ఆమీర్ఖాన్, రణ్బీర్ కపూర్, కరణ్జోహార్ తదితరులు హాజరయ్యారు. ముకేశ్, ఆయన సతీమణి నీతా అంబానీ దగ్గరుండి అతిథులను ఆహ్వానించారు. అంతేగాక, నీతా అంబానీ బాలీవుడ్ సినిమా పాటలకు నృత్యం చేసి ఆకట్టుకున్నారు.
ఆనంద్ ప్రేమకు ఈషా గ్రీన్ సిగ్నల్
ఈశా, ఆనంద్లు చాలా కాలాంగా మంచి స్నేహితులు. అంతేగాక వీరి కుటుంబాల మధ్య 40ఏళ్లుగా స్నేహబంధం కొనసాగుతోంది. ఇటీవలే ఈశాతో ఆనంద్ పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా.. అందుకు ఆమె కూడా అగీకరించారు. వీరి వివాహానికి ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకుని కలిసి విందు చేసుకున్నారు. ఈశా, ఆనంద్ల వివాహం డిసెంబరులో చేయాలని కుటుంబసభ్యులు భావిస్తున్నట్లు తెలిసింది.
ఆకాశ్ వివాహం కూడా డిసెంబర్లోనే..
అయితే, ఇప్పటికే ఈశా కవల సోదరుడు ఆకాశ్ అంబానీ వివాహం కూడా నిశ్చయమైన విషయం తెలిసిందే. ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకతో ఆకాశ్ నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది. వీరి వివాహం కూడా డిసెంబరులోనే జరగనుంది. వీరిద్దరి వివాహాలు ఏకకాలంలో జరిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.