ఇష్రత్ జహాన్ ఉగ్రవాదే, ముంబైలో ఆఫీస్ పెట్టా: హెడ్లీ
ముంబై: 26/11 ముంబై దాడుల కేసులో అప్రూవర్గా మారిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ సంచలన విషయాలు వెల్లడిస్తున్నాడు. నాలుగో రోజు గురువారం ముంబై ప్రత్యేక కోర్టు జడ్జికి వీడియో లింక్ ద్వారా హెడ్లీ వాంగ్మూలం ఇచ్చాడు. ముంబైపై ముష్కరుల దాడికి అండదండలు అందించింది పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐనేనని ఇప్పటికే వెల్లడించిన హెడ్లీ మరిన్ని విషయాలు బయటపెట్టాడు.
గుజరాత్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన అనుమానిత ఉగ్రవాది ఇష్రత్ జహాన్.. లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాదేనని డేవిడ్ హెడ్లీ వెల్లడించాడు. అయితే, ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఇష్రత్ జహాన్ అమాయకురాలని, ఆమెను బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారని ప్రతిపక్షాలు, పలు సంఘాలు అప్పటి గుజరాత్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాయి.
ఈ ఘటనపై అనేక విచారణలు జరిగాయి. కొందరు పోలీసులు, అధికారులు జైలుపాలు కూడా అయ్యారు. అయితే, ఈ ఘటనపై సరైన రీతిలో విచారణ జరగకపోవడం వల్లే అధికారులు, పోలీసులు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చిందని తెలుస్తోంది.
ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని అంతమొందించేందుకే వచ్చిన ఈ ఉగ్రవాదులు మొదట పోలీసులపై కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు పాకిస్థాన్ జాతీయులు అమ్జద్ అలీ, జిషన్ జోహార్ అబ్దుల్ ఘని, జావేద్ షేక్ అలియాస్ ప్రణేష్ పిళ్లైలతోపాటు ఇష్రత్ జహాన్ కూడా పోలీసుల కాల్పుల్లో హతమయ్యారు.
ఈ ఎన్కౌంటర్ తర్వాత అమాయకులను పొట్టనపెట్టుకున్నారంటూ ప్రతిపక్షాలు, ఇతర సంఘాలు ఆనాటి గుజరాత్ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేశాయి. కాగా, ప్రస్తుతం విచారణలో డేవిడ్ హెడ్లీ వెల్లడించడంతో ఇష్రత్ జహాన్ లష్కరే ఉగ్రవాది అని తేటతెల్లమైంది.
ముంబైలో ఆఫీస్ పెట్టా
ఐఎస్ఐ అధికారి మేజర్ ఇక్బాల్, సామిర్ అలీ, డాక్టర్ తహవుర్ రానా, అబ్దుర్ రెహ్మాన్ పాషా నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నానని వెల్లడించాడు. ముంబైలోని నారీమన్ ప్రాంతంలో ఉన్న ఇండస్ ఇండ్ బ్యాంకు ద్వారా ఈ మొత్తం అందుకున్నానని తెలిపాడు. భారత సైనిక నిఘా వ్యవహారాల రహస్యాలను సేకరించేందుకు ఆ నగదుఇచ్చారని చెప్పాడు.
2006, సెప్టెంబర్ 14న టార్డియో ఏసీ మార్కెట్ ప్రాంతంలో కార్యాలయం ప్రారంభించానని చెప్పాడు. 26/11 దాడుల తర్వాత దీన్ని మూసివేయాలని భావించినట్టు పేర్కొన్నాడు. భారత్లో తాను రెండుమూడు ఫోన్ నంబర్లు వినియోగించినట్టు తెలిపాడు. ఇక్బాల్, సామిర్ అలీ, రానాలతో ఇ-మెయిల్స్ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్టు పంపినట్టు తెలిపాడు. ముంబై దాడులు జరగడానికి ముందు తహవుర్ రానా ముంబై వచ్చి తనని భారత్ వదిలి వెళ్లాల్సిందిగా సూచించాడని తెలిపాడు.