చాందీపూర్ క్షిపణి కేంద్రం వద్ద ఐఎస్ఐ ఏజెంట్ అరెస్ట్
భువనేశ్వర్: ఒడిశాలోని చాందీపూర్లోని క్షిపణి పరీక్ష కేంద్రం(ఐటిఆర్)లో తాత్కాలిక ఛాయగ్రాహకుడిగా పని చేస్తున్న ఈశ్వర చంద్రబెహరా(35)ను శుక్రవారం బాలేశ్వర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటిఆర్లోని నిషేధిత ప్రాంతంలో అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈశ్వర్ను పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఏజెంట్గా అనుమానిస్తున్నారు. ఆయన కదలికలపై ఎనిమిది నెలలుగా కన్నేసి ఉంచామని పోలీసు అధికారులు వెల్లడించారు. కోల్కతాలోని ఒక ఐఎస్ఐ ఏజెంట్తో ఆయన రహస్యంగా సంబంధాలు నెరపుతున్నారనే ఆధారాలు ఉన్నాయని చెప్పారు.
క్షిపణి పరీక్షా కేంద్రానికి సంబంధించి ఈశ్వర్ రహస్యంగా ఛాయాచిత్రాలు తీసి పాకిస్థాన్కు పంపుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. ఈశ్వర్ నుంచి హార్డ్ డిస్క్, ల్యాప్టాప్, పెన్డ్రైవ్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
ఈశ్వర్ పై దేశద్రోహం, కుట్ర కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈశ్వర్ మయూర్భంజ్ జిల్లా బొయిసింగవాసి. క్షిపణి కేంద్రం కాంట్రాక్టు ఉద్యోగి అయిన బెహెరా కొంతకాలంగా ఐఎస్ఐకి కీలక రహస్యాలు చేరవేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి అసిత్ పాణిగ్రాహి తెలిపారు. ఐఎస్ఐతో బెహెరా కనీసం పదిసార్లు సంభాషించాడని, ఫలితంగా అతనికి రూ. 50 వేలు అందాయని పోలీసులు వెల్లడించారు.