రైలు పేలుళ్ల ఐఎస్ ఉగ్రవాది హతం: భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు(పిక్చర్స్)
మధ్యప్రదేశ్లో మంగళవారం భోపాల్-ఉజ్జయినీ ప్యాసింజర్ రైలులో పేలుడుకి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరిని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. దాడి అనంతరం ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదిని పోలీసులు.
షాజాపూర్/లక్నో: మధ్యప్రదేశ్లో మంగళవారం భోపాల్-ఉజ్జయినీ ప్యాసింజర్ రైలులో పేలుడుకి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరిని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. దాడి అనంతరం ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదిని పోలీసులు హతమార్చారు.
సుదీర్ఘ ఆపరేషన్ తరువాత ఉగ్రవాదిని హతమార్చినట్లు ఏటీఎస్ బృందం వెల్లడించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఐసిస్తో సంబంధాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఐసిస్ సానుభూతిపరుల కోసం వేట ముమ్మరం చేశారు.
కాగా, ఉగ్రవాదులు పైప్ బాంబు ఉపయోగించి భోపాల్-ఉజ్జయినీ ప్యాసెంజర్ రైల్లో పేలుడుకు పాల్పడినట్లు తెలుస్తోంది. అనుమానితుల దగ్గర పోలీసులకు పలు ఫొటోలు లభించాయి. అయితే, బాంబుల ఫొటోలను ఉగ్రవాదులు సిరియాకు పంపించినట్లు సమాచారం.
దుశ్చర్య
మధ్యప్రదేశ్లో మంగళవారం పాసింజరు రైలులో సంభవించిన విస్ఫోటం ఉగ్రమూకల దుశ్చర్యగా పోలీసులు తేల్చేశారు. ఈ విద్రోహ చర్యలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఘటనానంతరం అప్రమత్తమైన పోలీసులు జరిపిన తనిఖీల్లో ఆరుగురు నిందితులు పట్టుబడ్డారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించింది. రైళ్లలో భద్రతను రైల్వే శాఖ మరింత కట్టుదిట్టం చేసింది.
ఒక్కసారిగా పెద్ద శబ్ధం
మంగళవారం ఉదయం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఉజ్జయినికి బయలుదేరిన పాసింజరు రైలు షాజాపూర్ జిల్లా జబ్ది స్టేషన్కు చేరుకుంటుండగా 9.50 గంటల సమయంలో సాధారణ బోగీలో ఒక్క సారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఆ వెంటనే పొగ కమ్ముకోవటంతో ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు తీశారు. కొందరు బోగీ నుంచి కిందికి దూకారు. ఘటన జరిగిన స్థలం భోపాల్కు 81 కి.మీ. దూరంలో ఉంది. పేలుడు ధాటికి బోగీ పై కప్పు చెదిరిపోయింది. జనరల్ బోగీ పక్కనున్న మరో బోగీ కూడా దెబ్బతిందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రెండింటినీ జబ్ది స్టేషన్లో వదిలిపెట్టి మిగతా బోగీలతో రైలు గమ్యస్థానానికి బయలుదేరింది. క్షతగాత్రులను భోపాల్, స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
ఐసీస్ కుట్ర
ప్రాథమిక పరిశీలన ప్రకారం ఈ పేలుడు వెనుక విద్రోహ చర్య ఉన్నట్లు తెలుస్తోందని మధ్యప్రదేశ్ హోంమంత్రి భూపేంద్ర సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. కుట్రను ఛేదించే దిశగా దర్యాప్తు చేపట్టామన్నారు. మెరుగుపరిచిన పేలుడు పదార్థం (ఐఈడీ) స్వల్ప స్థాయిలో వినియోగించినట్లు తెలుస్తుందని ఆ రాష్ట్ర ఐజీ మక్రాంద్ దేవాస్కర్ చెప్పారు.
చిక్కిన ఉగ్రవాదులు
ఘటనానంతరం హోషంగాబాద్ జిల్లా పిపరియా పట్టణంలో ముగ్గురు నిందితులను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో యూపీలోని ఎటావాలో ఒకడు, కాన్పూర్లో ఇద్దరు అనుమానితులు పట్టుబడ్డారు. పేలుడు కుట్రతో వీరికి సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. లఖ్నవూ శివారులోని ఓ ఇంటిలోకి చొరబడిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) ప్రత్యేక ఆపరేషన్ను చేపట్టింది. నిందితులు ఐఎస్ఐఎస్ ప్రేరేపిత వ్యక్తులుగా పోలీసులు భావిస్తున్నారు. తొలుత దాగున్నది ఒకరేనని భావించినా ఆ తర్వాత ఇద్దరు ఉన్నట్లుగా గుర్తించారు. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ యూపీ డీజీపీతో మాట్లాడి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు.
అప్రమత్తం
రైలులో పేలుడు ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారణకు ఆదేశించారు. దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశమున్నందున దేశవ్యాప్తంగా అప్రమత్తతను ప్రకటించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ అహిర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లోని భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది.