సీఏఏ వ్యతిరేక ఆందోళనల హైజాక్కి స్కెచ్.. ఆత్మాహుతి దాడులకు కుట్ర.. ఆ ఇద్దరే..
దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను హైజాక్ చేసి ఆత్మాహుతి దాడులకు పాల్పడాలని ప్లాన్ చేస్తున్న ఓ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని జహన్జెబ్ షమీ,హినా బషీర్ బేగ్లుగా గుర్తించారు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఈ జంటకు ఆఫ్ఘనిస్తాన్లోని ఖరోసన్ ప్రావిన్స్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. సీఏఏకి వ్యతిరేకంగా ముస్లిం యువతను ప్రేరేపించి ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ఐఎస్ఐఎస్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా సీఏఏకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లోకి చొరబడి విధ్వంసానికి పాల్పడేందుకు.. ఆ జంట ఆఫ్ఘనిస్తాన్ ఐసిస్ సభ్యులతో టచ్లో ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. పక్కా ఆపరేషన్తో సౌత్ ఢిల్లీలోని జామియా నగర్లోని వారి ఇంట్లోనే పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు సోషల్ మీడియాలో 'ఇండియన్ ముస్లిం యునైట్' అనే పేజీని కూడా నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ముస్లిం యువతను ఆకర్షించేందుకు దాన్ని ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు.
ఢిల్లీలో జరుగుతున్న సీఏఏ ఆందోళనల వెనుక కుట్ర దాగుందని అధికార బీజేపీ పలుమార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. ముస్లింలను మెప్పించడం కోసమే కాంగ్రెస్ సీఏఏ వ్యతిరేక ఆందోళనలను రెచ్చగొడుతోందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. అంతేకాదు,నిరసనల వెనుక పాకిస్తాన్ పాత్ర కూడా ఉందని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
ఢిల్లీలోని షాహీన్బాగ్లో ఇప్పటికీ సీఏఏ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గత మూడు నెలలుగా సాగుతున్న ఆందోళనలకు చర్చలతో ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం జరిగినప్పటికీ.. అవేవీ సఫలం కాలేదు. ఇదే క్రమంలో ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగి 53 మంది మృతి చెందారు. దీనిపై ప్రస్తుతం సిట్ బృందాలు విచారణ జరుపుతున్నాయి.