పెద్ద కుట్రే?: మోడీని స్నైపర్ రైఫిల్తో చంపేందుకు ప్లాన్!..
Recommended Video
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు పథకం వేసి గతేడాది గుజరాత్ యాంటీ-టెర్రర్ స్క్వాడ్ కి పట్టుబడ్డ ఐసిస్(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్&సిరియా) నిందితులు అహ్మద్ మీర్జా, మహ్మద్ ఖాసీం స్టింబెర్వాలా.. విచారణలో సంచలన విషయాలు బయటపెట్టారు.
ఈ మేరకు గుజరాత్ ఏటీఎస్ గత నెల ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేసింది. 'మోడీని ఒక స్నైపర్ రైఫిల్తో హత్య చేద్దాం' అని గుర్తు తెలియని వ్యక్తి ఆ ఇద్దరు ఐఎస్ ఉగ్రవాదులకు చెప్పాడని ఏటీఎస్ తన చార్జిషీటులో పేర్కొంది. కాగా నిందితులు ఇద్దరిని గత ఏడాది అక్టోబరులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారిపై చార్జిషీట్ దాఖలు చేసి భారుచ్ లోని అంక్లేశ్వర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
నిందితుడైన మీర్జా ఓ గుర్తు తెలియని వ్యక్తితో మోడీ హత్య గురించి వాట్సాప్ ద్వారా సంభాషించడంతో ఈ కుట్ర బయటపడింది. గుర్తు తెలియని వ్యక్తి ఫెరారీ అనే మారుపేరుతో 2016 సెప్టెంబరు 10న మీర్జాతో వాట్సాప్ చాట్ చేసినట్టు ఏటీఎస్ చార్జిషీటులో పొందుపరిచింది. అలాగే తుపాకుల కొనుగోలుకు సంబంధించి కూడా వారి మధ్య సంభాషణ సాగినట్టు పేర్కొంది.
ఈ సంభాషణల్లో భాగంగా.. 'అవును, ఒక స్నైపర్ రైఫిల్ తో మోడీని హత్య చేద్దాం, ఇన్షా అల్లా' అని ఫెరారీ పేర్కొనట్టు చార్జిషీటులో ఏటీఎస్ పేర్కొంది. అదే సమయంలో ఓ రష్యన్ తయారీ గన్ గురించి ఫెరారీ ప్రస్తావించగా.. తనకు అది కావాలని చెప్పారు మీర్జా. 2016 జూలై 26న ఇద్దరి మధ్య మరో వాట్సాప్ చాట్ జరిగినట్టు ఏటీఎస్ గుర్తించింది.
వేటకత్తులు, వంటింటి కత్తులతో దాడులకు దిగాలని, పైనుంచి ఆదేశాలు వచ్చాయని ఫెరారీ అందులో పేర్కొన్నట్టు ఏటీఎస్ చెప్పింది. నిందితులు మీర్జా, స్టింబర్ వాలా జీహాదీ భావజాలం పట్ల బాగా ఆకర్షితులయ్యారని పేర్కొంది. ఇక ఈ కేసుకు సంబంధించి జమైకాకు చెందిన అబ్దుల్లా ఫైజల్ అనే రాడికల్ బోధకుడు పరారీలో ఉన్నట్టు చార్జిషీటులో ఏటీఎస్ తెలిపింది.
నిందితులు మీర్జా, స్టింబర్ వాలా ఇద్దరూ అబ్దుల్ ఫైజల్, అమర్ లతో టచ్ లో ఉంటూ భారత్ లోని యూదులపై దాడులకు ప్లాన్ చేశారని పేర్కొంది. వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్ 120-బి(నేరపూరిత కుట్ర) 121-ఏ, 125 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.