తాజ్మహల్ను టార్గెట్ చేసిన ఐసిస్: పేల్చేస్తామని హెచ్చరిక!..
ఐసిస్ హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం తాజ్ మహల్ చుట్టు పక్కల భారీ భద్రత ఏర్పాటు చేసింది.
న్యూఢిల్లీ: దేశంలో పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే తాజ్మహల్పై ఇప్పుడు ఐసిస్(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాదుల కన్ను పడింది. నిత్యం పర్యాటకుల తాకిడితో రద్దీగా ఉండే తాజ్ మహల్ను పేల్చేస్తామని ఐసిస్ ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేశారు. ఐసిస్ హెచ్చరికలతో అప్రమత్తమైన భద్రతా యంత్రాంగం తాజ్ మహల్ చుట్టు పక్కల భారీ భద్రత ఏర్పాటు చేసింది.
తాజ్మహల్ పేలుళ్ల హెచ్చరికలకు సంబంధించి ఐసిస్ కు అనుబంధంగా ఉన్న అహ్వల్ ఉమాత్ అనే మీడియా విభాగం ఈ విషయాన్ని ప్రకటించింది. ఇంటలిజెన్స్ గ్రూప్ అనే సంస్థ తొలుత ఈ పేలుళ్ల హెచ్చరికలను గుర్తించింది. తాజ్ మహల్ ను పేల్చేస్తామంటూ ఈ నెల 14న టెలిగ్రామ్ సోషల్ మీడియాలో పేర్కొన్నట్లు తెలిపింది.
తాజ్మహల్ ను పేల్చేయడానికి ఐసిస్ ఉగ్రవాది తుపాకీతో సిద్దంగా ఉన్నట్లు కనిపించే ఫోటోను సోషల్ మీడియాలో ఆ ఉగ్రవాద అనుబంధ మీడియా పోస్టు చేసింది.
ఇదిలా ఉంటే, ఇటీవలి ఉజ్జయిని బాంబు పేలుళ్లలో ఐసిస్ ఉగ్రవాది హస్తం ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పేలుళ్లకు కారణమైన ఉగ్రవాది లక్నోలో తలదాచుకున్నాడన్న సమాచారంతో కమెండోలు అతన్ని మట్టుపెట్టారు. ఈ నేపథ్యంలో మరోసారి ఐసిస్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడం గమనార్హం.
కాగా, తాజ్మహల్ ను పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపులపై ఎస్పీ ప్రతిందర్ సింగ్ స్పందించారు. సాధారణంగా సీఐఎస్ఎఫ్ దళాలు పహారా కాస్తుంటాయని, వెలుపల ఉత్తరప్రదేశ్ పోలీసుల భదత్ర కూడా ఉంటుందని చెప్పారు. తాజ్మహల్ వద్ద ప్రతి రోజు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. తాజ్మహల్ని చూడడానికి ప్రతి ఏడాది దాదాపు 60 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారని అన్నారు.