క్రైస్తవ అమ్మాయిలే టార్గెట్..ఇప్పటిదాకా 4000 వేల మంది..
తిరువనంతపురం: క్రైస్తవ అమ్మాయిలను టార్గెట్ గా చేసుకుని ఇస్లామిక్ రాడికల్స్ చెలరేగిపోతున్నారంటూ జాతీయ మైనారిటీ హక్కుల కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇస్లామిక్ రాడికల్స్ బారి నుంచి క్రైస్తవ అమ్మాయిలను రక్షించడానికి తక్షణ చర్యలను తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కేరళ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రవాదం చాపకింద నీరులా వ్యాపించడానికి ఇస్లామిక్ రాడికల్స్ కూడా ఓ ప్రధాన కారణమని జాతీయ మైనారిటీ హక్కుల కమిషన్ ఉపాధ్యక్షుడు జార్జ్ కురియన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానకు లేఖ రాశారు. కొంతమంది మైనారిటీ యువకులు క్రైస్తవ అమ్మాయిలను టార్గెట్ చేసుకుని లవ్ జిహాద్ పేరుతో వల విసురుతున్నారని, తమ చేతికి చిక్కిన తరువాత ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కేరళలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న సంఘటనలను ఆయన దీనికి ఉదహరించారు.
ఇట్టాంటి రిపోర్టర్లంతా నీకెట్టా దొరికారయ్యా?: పాక్ ప్రధానిని ప్రశ్నించిన ట్రంప్: బిత్తరపోయిన ఇమ్రాన్
కోజికోడ్ కు చెందిన ఓ 19 సంవత్సరాల యువతిని మైనారిటీ వర్గానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో వంచించాడని, బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేలా చేశాడని కురియన్ తెలిపారు. ఆ అమ్మాయి కొంతకాలంగా కనిపించకుండాపోయిందని, ఇటీవలే ఆమె కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గాలంపు చర్యలు చేపట్టిందని చెప్పారు. కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన ఓ సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి కోసం ఏకంగా జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తుండటం తీవ్రమైన అంశంగా పరిగణించాలని కోరారు. 2005 నుంచి 2012 మధ్యకాలంలో సుమారు నాలుగు వేల మంది క్రైస్తవ మలయాళీ యువతులు ప్రేమ పేరుతో లవ్ జిహాద్ బారిన పడ్డారని, అనంతరం మతం మారినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఉగ్రవాదం వైపు మొగ్గు చూపడానికి నిరాకరించిన అమ్మాయిలపై లైంగిక దాడికి దిగుతున్నారని, అనంతరం వాటిని వీడియోలుగా చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని జార్జ్ కురియన్ కోరారు. ఇదే తరహా వాతావరణం కొనసాగితే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కేరళ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే ఉగ్రవాదం వ్యాపించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ స్పష్టం చేసిందని చెప్పారు. తమిళనాడులోని కోయంబత్తూరు, రామనాథపురం, కడలూర్, కేరళలోని కాసర గోడ్, కన్నూర్ జిల్లాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలను చేపట్టిన విషయాన్ని కురియన్ గుర్తు చేశారు. కనిపించకుండా పోయిన క్రైస్తవ అమ్మాయిలు ఉగ్రవాదం వైపు ఆకర్షితులైనట్లు స్వయంగా కుటుంబ సభ్యల నుంచి సైతం మైనారిటీ కమిషన్ కు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.