ఒంటరి తోడేలు తరహా దాడి...ఢిల్లీలో భారీ పేలుళ్లకు ఐసిస్ స్పాట్... 'అయోధ్యలో రామ మందిరం'కు ప్రతీకారంగా
పెను ముప్పు తప్పింది. పోలీసుల అప్రమత్తతో భారీ ఉగ్ర కుట్ర బయటపడింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రతీకారంగా ఢిల్లీలో భారీ పేలుళ్లకు చేసిన కుట్రను పోలీసులు చేధించారు. పేలుళ్ల సూత్రధారి,ఐసిస్ ఉగ్రవాది అబు యూసుఫ్ను అరెస్ట్ చేసి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు,మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు. ఒంటరి తోడేలు తరహా దాడికి(Lone Wolf Attack) అతను ప్లాన్ చేసినట్లు గుర్తించారు.
బుద్ద జయంతి పార్క్ సమీపంలో...
ఢిల్లీలోని దౌలా కౌన్,కరోల్ బాగ్ ప్రాంతాల్లో యూసుఫ్ కదలికలపై శుక్రవారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. బుద్ద జయంతి పార్క్లో ఆ అనుమానిత ఐసిస్ ఉగ్రవాది ఓ బైక్పై వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో ఇరువురి మధ్య కాల్పులు కూడా జరిగాయి. అరెస్ట్ అనంతరం బుద్ద జయంతి పార్క్ సమీపంలో భూమిలో పాతిపెట్టిన 15 కిలోల బరువైన రెండు భారీ ఐఈడీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతని రెండు ప్రెజర్ కుక్కర్స్తో పాటు అతని వద్ద నుంచి ఒక గన్ను స్వాధీనం చేసుకున్నారు. పదుల సంఖ్యలో ఎన్ఎస్జి కమాండోలు,బాంబ్ డిటెక్షన్ టీమ్ రంగంలోకి దిగి బాంబులను నిర్వీర్యం చేశారు.
ఒంటరి తోడేలు తరహా దాడి...
అతను ఒంటరి తోడేలు తరహా దాడికి కుట్ర చేసినట్లు గుర్తించారు. పేలుడు పదార్థాలను గుర్తించాక వాటిని ఓ ప్రత్యేక రిమోట్ కంట్రోల్ వాహనంలోకి జాగ్రత్తగా లిఫ్ట్ చేశారు. అనంతరం ప్రత్యేక నిపుణుల బృందం ఆ వాహనంలోనే వాటిని నిర్వీర్యం చేసింది. దీనికి దాదాపు 3 గంటల సమయం పట్టింది. అనంతరం పోలీసులు,ఎన్ఎస్జీ కమాండోలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి అణువణువు గాలించారు. అనంతరం అబు యూసుఫ్ని కోర్టులో హాజరుపరచగా... న్యాయస్థానం 8 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది.
విచారణకు సహకరించని యూసుఫ్
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో పోలీస్ కస్టడీలో ఉన్న అబు యూసుఫ్ విచారణకు ఏమాత్రం సహకరించట్లేదని తెలుస్తోంది. తప్పుడు సమాచారంతో పోలీసులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. తన చిరునామాకు సంబంధించి మూడు అడ్రెస్లను అతను ప్రస్తావించినట్లు చెబుతున్నారు. అందులో ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్,ఘజియాబాద్తో పాటు ఉత్తరాఖండ్ కూడా ఉన్నాయి. దీంతో ఈ మూడింటిలో అతని చిరునామా ఏదో గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Recommended Video
అయోధ్యలో రామ మందిరానికి ప్రతీకారంగా....
విచారణలో ఎంతకీ నోరు విప్పని అబు యూసుఫ్ ఎట్టకేలకు తన ఉగ్రవాద లింకులపై మాత్రం పోలీసులకు పలు విషయాలు వెల్లడించినట్లు చెబుతున్నారు. ఆఫ్టనిస్తాన్లోని ఐసిస్ ఉగ్రవాదులతో టచ్లో ఉన్నానని,అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రతీకారంగా భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేశామని వెల్లడించినట్లు చెబుతున్నారు. ఢిల్లీలో ఉగ్రదాడికి పలు ప్రాంతాల్లో యూసుఫ్ రెక్కీ కూడా నిర్వహించాడు. అయితే ఆ స్పాట్స్ ఏంటన్నది తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.ఉగ్ర కుట్ర బయటపడటంతో ఉత్తరప్రదేశ్,ఢిల్లీ,నోయిడా ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ డీజీపీ హితేశ్ చంద్ర... సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద భద్రతా తనిఖీలను ముమ్మరం చేయాలని చెప్పారు.