ఉగ్రవాదులు రూటు మార్చారు..మావోయిస్టులతో మిలాఖత్: అత్యంత ప్రమాదకరం: సీపీఎం నేత సంచలనం
తిరువనంతపురం: ఇస్లామిక్ ఉగ్రవాదం రూటు మార్చిందా? మనదేశంలో స్థానికంగా బలంగా ఉంటోన్న మావోయిస్టులతో చేతులు కలిపారా? మావోయిస్టులతో కలిసి ఉగ్రవాద దాడులకు తెగబడే ప్రమాదం లేకపోలేదా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఇస్తున్నారు సీపీఎం సీనియర్ నాయకుడొకరు. ఆయన పేరు పీ మోహనన్. కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) కీలక నేత. కోజికోడ్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తోన్న మోహనన్.. మంగళవారం సంచలన ప్రకటన చేశారు.
ఇస్లామిక్ ఉగ్రవాదులు తమ రాష్ట్రంలో చాపకింద నీరులా వ్యాపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా బలంగా ఉన్న మావోయిస్టులతో వారు సత్సంబంధాలను ఏర్పరచుకున్నారని చెప్పారు. మావోయిస్టుల సహకారంతో ఉగ్రవాద కార్యకలాపాలను వ్యాపింపజేయడానికి వ్యూహాలు పన్నుతున్నారని అన్నారు. ఈ అంశంపై తన వద్ద పక్కా సమాచారం ఉందని, ఈ దిశగా సమగ్ర దర్యాప్తును చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
మావోయిస్టులు బలహీనంగా ఉన్న చోట్ల వారికి ఆర్థికంగా అండదండలను అందిస్తున్నారని మోహనన్ అన్నారు. నారు వేసి, నీరు పోసి మరీ మావోయిస్టులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల అండదండలతో మావోయిస్టులు అత్యాధునిక ఆయుధాలను సైతం సమకూర్చుకుంటున్నారని అన్నారు. ఈ రెండు వర్గాలు చేతులు కలపడం అత్యంత ప్రమాదకరమని, భవిష్యత్తులో పెను ప్రమాదం పొంచి ఉంటుందని మోహనన్ హెచ్చరించారు.
నిజానికి- ప్రపంచాన్ని వణికించిన భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ సానుభూతిపరులు కేరళలో పెద్ద ఎత్తున ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇదివరకే హెచ్చరించిన విషయం తెలిసిందే. కేరళలో ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్న కాసర్ గోడ్ జిల్లాకు చెందిన కొంతమంది మైనారిటీ యువకులు పెద్ద సంఖ్యలో అదృశ్యం అయ్యారని, వారంతా ఐసిస్ లో చేరి ఉండొచ్చంటూ జాతీయ దర్యాప్తు సంస్థ ఓ జాబితాను సైతం రెండేళ్ల కిందట విడుదల చేసింది.
ఉగ్రవాద కార్యకలాపాలతో శిక్షణ పొందిన వారంతా ఇప్పుడు మళ్లీ స్వరాష్ట్రానికి వచ్చి ఉండొచ్చని, స్థానిక మావోయిస్టులతో చేతులు కలిపారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మోహనన్ చేసిన ప్రకటన పోలీసు అధికారులను అప్రమత్తం చేసింది. అధికార పార్టీ నాయకుడు కావడం వల్ల.. ప్రభుత్వం సైతం ఆయన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది.