సెలబ్రిటీలకు ఐఫోన్లు.. అందులో స్పై యాప్, ఆపైన బ్లాక్ మెయిల్ చేసి...
బాలీవుడ్ సినీనటులకు స్పైయాప్ ఇన్స్టాల్ అయి ఉన్న ఐఫోన్లు బహుమతిగా ఇచ్చి... ఆపైన వారి సంభాషణలన్నీ రికార్డ్ చేసి... బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడిన ఓ ప్రైవేటు డిటెక్టివ్ బాగోతాన్ని థానే నగర పోలీసులు బహిర
ముంబై : బాలీవుడ్ సినీనటులకు స్పైయాప్ ఇన్స్టాల్ అయి ఉన్న ఐఫోన్లు బహుమతిగా ఇచ్చి... ఆపైన వారి సంభాషణలన్నీ రికార్డ్ చేసి... బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడిన ఓ ప్రైవేటు డిటెక్టివ్ బాగోతాన్ని థానే నగర పోలీసులు బహిర్గతం చేశారు.
డబ్బు కోసం సాక్షాత్తూ ఓ ఐఎఎస్ అధికారిని బెదిరించి జైలు పాలైన ప్రైవేటు డిటెక్టివ్ సతీష్ మంగాలే బాధితుల జాబితాలో పలువురు బాలీవుడ్ నటీనటులున్నారని థానే పోలీసుల దర్యాప్తులో తేలింది. కొల్హాపూర్ గ్రామానికి చెందిన సతీష్ ముంగాలే పదోతరగతితో చదువు వదిలి కంప్యూటరు డిప్లోమా చేసి ప్రైవేటు డిటెక్టివ్ సంస్థలో పనిచేస్తున్నాడు.
థానే పోలీసు విభాగం సీనియర్ ఇన్ స్పెక్టరు ప్రదీప్ శర్మ కథనం ప్రకారం.. గత ఏడాది సతీష్ తన భార్య మరాఠీ సినీనటి శ్రద్ధాతో కలిసి ముంబై నగరంలోని బోరివలి ప్రాంతంలో ఓ స్పా ను ప్రారంభించాడు. స్పా ప్రారంభ కార్యక్రమానికి సినీనటులు రాఖీసావంత్, ముఖేష్ రిషి, బిగ్బాస్ సెలబ్రిటీ గౌతం గులాటీ, సోనాలీ రాత్, జరీన్ ఖాన్, విందూ దారాసింగ్ లను పిలిచాడు.
ఆ కార్యక్రమంలో వారందరికీ స్పై యాప్ అమర్చిన ఐ ఫోన్లను బహుమతిగా ఇచ్చాడు. ఇక ఆ తరువాత స్పై యాప్ ద్వారా సినీనటుల మాటలు విన్న సతీష్ వారినే బెదిరించి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు.
సతీష్ స్నేహితుడు జిగార్ కూడా మరో ప్రైవేటు డిటెక్టివ్ సంస్థను నడుపుతున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇచ్చిన ఐఫోన్లలో జిగార్ ఈ స్పై యాప్ ఇన్ స్టాల్ చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
సతీష్ ఏడు ఈ మెయిల్స్ ఖాతాలు తెరచి వాటి ద్వారా నాలుగు వేల కాల్ రికార్డులు భద్రం చేసి ఉంచాడని తేలింది. ప్రస్తుతం సతీష్ ల్యాప్ ట్యాప్ లో ఉన్న కాల్ రికార్డులను పోలీసులు విశ్లేషిస్తున్నారు.
ఇలా బెదిరించి వసూలు చేసిన డబ్బులు రూ.50 లక్షలతో సతీష్ తన స్వగ్రామంలో ఇల్లు నిర్మించాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం సతీష్ ఇళ్లను తనిఖీ చేయడంతోపాటు పలువురు బాధితులైన బాలీవుడ్ నటీనటులను కూడా విచారిస్తామని పోలీసులు వివరించారు.