మోదీ.. విప్లవాత్మక నాయకుడు..: ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహు
Recommended Video
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రోటోకాల్ ను కూడ పక్కన పెట్టి ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమెన్ నెతన్యూహుకు స్వాగతం పలికారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కలిసి మోదీ తీన్ మూర్తి చౌక్కు వెళ్తారు. అక్కడ జరుగనున్న కార్యక్రమంలో ఇరు దేశాధినేతలు పాల్గొంటారు. ఈ సందర్భంగా తీన్ మూర్తి చౌక్ పేరును తీన్ మూర్తి హైఫీ చౌక్గా మార్చనున్నారు.
నెతన్యాహు భారత్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నెతన్యాహు వెంట ముంబై పేలుళ్ల నుంచి సురక్షితంగా బయటపడిన 11ఏళ్ల బాలుడు మోషే కూడా భారత్ వచ్చాడు. బెంజమిన్ భారత్ లో 6 రోజులపాటు పర్యటించనున్నారు.
భారత్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను కొత్త పుంతలు తొక్కిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన ఆత్మీయ స్వాగతంపై ఓ ట్వీట్లో నెతన్యాహు సంతోషం వ్యక్తం చేశారు.
మోదీ సైతం నెతన్యాహు భారత్లో పర్యటించడం చరిత్రాత్మకమని, ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు ఆయన రాకతో మరింత పరిపుష్టమవుతాయని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. నెతన్యాహును మోదీ గాఢాలింగనం చేసుకోవడంపై కాంగ్రెస్ తన అఫీషియల్ ట్విట్టర్లో 'హగ్ డిప్లొమసీ' అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది.
మోదీ ఓ విప్లవాత్మకమైన నాయకుడని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. సోమవారం ఇరు దేశాధినేతలు దిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భేటీ అయి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య తొమ్మిది అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
సైబర్ సహకారం, శాస్త్ర సాంకేతికం, ఇంధనం, వ్యవసాయం, భద్రతా, సినిమా సహకారం తదితర రంగాలపై ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కోసం ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పంద పత్రాలను ఇరు దేశాల ప్రతినిధులు ఇరు దేశ ప్రధానుల సమక్షంలో మార్చుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు.