ఇస్రో ఛైర్మన్ కే శివన్ పదవీ కాలాన్ని పొడిగించిన కేంద్రం
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఛైర్మన్ కైలసవాడివో శివన్(కే శివన్) పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెక్రటరీ, స్పేస్ కమిషన్ ఛైర్మన్గా ఉన్న ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయంతో 2022 జనవరి 14 వరకు ఇస్రో అధిపతిగా కే శివన్ కొనసాగేందుకు అవకాశం లభించింది. శివన్ 2018, జనవరి 10న ఇస్రో ఛైర్మన్గా నియమితులయ్యారు. అప్పటి ఛైర్మన్గా ఉన్న ఏకే కిరణ్ కుమార్ నుంచి జనవరి 14న బాధ్యతలు స్వీకరించారు.
కాగా, శివన్ కాకుండా, మరో ఇద్దరు సీనియర్ శాస్త్రవేత్తలు, వి.ఎస్.ఎస్.సి డైరెక్టర్ ఎస్ సోమనాథ్, యుఆర్ఎస్ఐసి డైరెక్టర్ కున్హికృష్ణన్ అత్యున్నత స్థాయిలో ఉన్నారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు నివేదించినట్లుగా.. వీరిద్దరితోపాటు మరొక సీనియర్ శాస్త్రవేత్త... కొత్తగా ఏర్పడిన అంతరిక్ష నియంత్రకం IN-SPACe చైర్మన్ పదవికి సిఫారసు చేయబడ్డారు. IN-SPACe పనిచేసే అంతరిక్ష విభాగం, దాని ఛైర్మన్ నియామకంపై కేంద్రం, పీఎంవో నుంచి వచ్చే నిర్ణయం కోసం వేచి ఉంది.