ఇస్రో మరో ఘనత: స్పేస్ క్రాఫ్ ప్రమాద సమయంలో క్యాప్సూల్ ద్వారా ప్రాణాలతో బయటపడొచ్చు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనతను సాధించింది. ఇస్రో రూపొందిస్తున్న మానవ అంతరిక్ష విమానంలో ఏదైనా ప్రమాదం జరిగితే అందులోని వ్యోమగాములు ప్రాణాలతో ఎలా బయటపడాలో ఓ ప్రయోగం చేసి సక్సెస్ సాధించింది. ఈ ప్రయోగాన్ని ఇస్రో పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతోనే పూర్తి చేసింది. ఈ ప్రయోగం అనుకున్న దానికంటే మూడు నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుంది. వ్యోమగాములు ఉండే ప్రత్యేక క్యాప్సూల్ను ఎమర్జెన్సీ ప్యాడ్ అబార్ట్ టెస్టు ద్వారా ప్రయోగించింది. మానవ అంతరిక్ష విమానంలో ఓ ప్రత్యేక స్పేస్ క్యాప్సూల్లో వ్యోమగాములు ఉంటారు. ప్రమాద సమయంలో ఈ క్యాప్సూల్ విడుదలై వారు సురక్షితంగా బయటపడతారు.
అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపాలన్న ఆలోచన ఇస్రోకు ఎప్పటి నుంచో ఉంది. ఇందుకోసం ఎప్పటినుంచో ప్రయోగాలను ప్రారంభించింది. ఓ స్పేస్ రాకెట్లో ఇద్దరు వ్యోమగాములను పంపి ఉపగ్రహాలకు ఏమైనా మరమత్తులు చేయాల్సి ఉంటే వారు చేసేందుకు వీలుగా ఓ క్యాప్సూల్ను రూపొందించింది.
అయితే గురువారం ప్రయోగించిన రాకెట్ పూర్తిగా భూమి వాతావరణంలోనే శాస్త్రవేత్తలు ప్రయోగించారు. ఈ ప్రయోగం కోసం GSLV MKIII ని వినియోగించారు. ఈ ప్రయోగం గతేడాదే చేయాల్సిఉండగా కొన్ని అనివార్య కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. ఇక ఈ ప్రయోగం గురించి ఇస్రో ఇంకా ఎలాంటి వివరాలను బహిర్గతం చేయలేదు. అంతా రహస్యంగానే ఈ ప్రయోగం జరిగింది.