2 బ్రిటన్ ఉపగ్రహాలు నింగిలోకి: పీఎస్ఎల్వీ కౌంట్డౌన్ షురూ
నెల్లూరు: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఆదివారం రాత్రి 10.08 గంటలకు నింగిలోకి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి42ని పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది పూర్తిగా వాణిజ్యపరమైన ప్రయోగం.
ఈ ప్రయోగం ద్వారా బ్రిటన్కు చెందిన నోవాసర్, ఎస్1-4 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెడతారు. ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్డౌన్ ప్రక్రియ శనివారం మధ్యాహ్నం 1.08 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 33 గంటలపాటు కొనసాగిన తర్వాత పీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లనుంది.
నోవాసర్, ఎస్1-4 ఉపగ్రహాలకు సర్వే శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థ రూపకల్పన చేసింది. ఇవి రెండూ భూపరిశీలన ఉపగ్రహాలు. సుదీర్ఘ విరామం తర్వాత ఇస్రో పీఎస్ఎల్వీ-సీ42 ప్రయోగం చేపట్టింది.
కాగా, శుక్రవారం సాయంత్రానికే ఇస్రోలోని అన్ని కేంద్రాల సంచాలకులు, సీనియర్ శాస్త్రవేత్తలు షార్కు చేరుకున్నారు. కౌంట్డౌన్ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఆదివారం రాత్రి 10.08గంటలకు ఈ ప్రయోగం తుది దశకు చేరుతుంది.