భారత నిఘా నేత్రం కార్టోశాట్-2: పాక్కు ఇక వణుకే
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనతను సాధించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రంనుంచి వందో ఉపగ్రహాన్ని ప్రయోగించి విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
31 శాటిలైట్లతో నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 40
శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్ఎల్వీ-సి40 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టింది. వీటిలో భారత్కు చెందిన కార్టోశాట్-2ఇ, ఒక నానో శాటిలైట్, ఒక సూక్ష్మ ఉపగ్రహం ఉన్నాయి. భారత్ తన వందో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడంతో ప్రపంచ దేశాలు ఈ ప్రయోగాన్ని ఆసక్తిగా గమనించాయి. కాగా, ఈ ప్రయోగంలో కార్డోశాట్-2 కీలకమైనదిగా చెప్పుకోవచ్చు.
కార్టోశాట్-2ఇ ప్రత్యేకత ఇదే..
ఇప్పటివరకు ‘కార్టోశాట్' సిరీస్లో ఆరు ఉపగ్రహాలను ప్రయోగించగా తాజాగా ఏడో ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు. సుమారు 737.5 కేజీల బరువు కలిగిన ‘కార్టోశాట్'లో అత్యాధునికమైన కెమెరాలను అమర్చారు. భూమి మీద నిర్దిష్ట ప్రదేశానికి సంబంధించి హైరిజల్యూషన్ చిత్రాలను అందించడం కార్టోశాట్-2ఇ ఉపగ్రహ ప్రత్యేకత.
అనేక ప్రయోజనాలు
కార్టోశాట్-2 శ్రేణిలో ఇది మూడో ఉపగ్రహం. ఇందులో పాన్క్రొమాటిక్, మల్టీ స్పెక్ట్రల్ కెమెరాలు ఉంటాయి. హై రిజల్యూషన్ డేటాను అందించడంలో వీటికి తిరుగులేదు. పట్టణ, గ్రామీణ ప్రణాళిక; తీర ప్రాంత వినియోగం, నియంత్రణ; రోడ్డు నెట్వర్క్ పర్యవేక్షణ, నీటిపంపిణీ, భూ వినియోగంపై మ్యాప్ల తయారీ; భౌగోళిక, మానవ నిర్మిత అంశాల్లో మార్పు పరిశీలన వంటి అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.
పాక్ సరిహద్దుపై నిఘా నేత్రమే
ఐదేళ్లు పనిచేసే ఈ ఉపగ్రహంతో మన పొరుగుదేశాలపైనా నిత్యం నిఘావేసి ఉంచే సదుపాయం కలుగుతుంది. ముఖ్యమంగా పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. కాగా, కార్డోశాట్ 2లోని ఈ కెమెరాలు భూమిపై ఒక మీటర్ పరిధిని కూడా స్పష్టంగా చిత్రీకరించి త్వరితంగా ఉండే నియంత్రణ కేంద్రాలకు పంపగలవు. ఇప్పటికే అంతరిక్షంలో సేవలందిస్తున్న ‘కార్టోశాట్' తరగతికి చెందిన ఉపగ్రహాలు పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని అందివ్వడం గమనార్హం.
సమస్యలకు పరిష్కారం
అంతేగాక, తాజా కార్టోశాట్' ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఖచ్చితత్వంతో కూడిన రేఖాచిత్రాలను తయారుచేసే సౌలభ్యం లభిస్తుంది. మన దేశానికి మూడువైపులా సువిశాలమైన సముద్రతీరం ఉంది. తీరప్రాంత భూముల సమర్థ వినియోగం, జలాల పంపిణీ, రహదారి నిర్వహణకు సంబంధించి సమగ్రమైన వ్యవస్థపై దృష్టి తదితర అంశాల్లోనూ వీటి సేవలను పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి కచ్చితమైన సమాచారం అందుబాటులోకి రానుంది. దీంతో ఈ ప్రాజెక్టుల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కార్డోశాట్-2ను భారత నిఘా నేత్రంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.