భారత్ మరో ముందడుగు.. పీఎస్ఎల్వీసీ-33 సక్సెస్..
సొంత నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే క్రమంలో.. ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహ ప్రయోగాలలో చివరిదైన ఏడవ ఉపగ్రహం పీఎస్ఎల్వీసీ-33 ని కక్షలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 1,425 కిలోల బరువున్న పీఎస్ఎల్వీసీ-33 ని గురువారం కక్షలోకి ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. నిర్దేశించిన సమయంలోనే ఉపగ్రహం కక్షలోకి ప్రవేశించడంతో షార్ శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల పనితీరును ప్రధాని మోడీ అభినందించారు.
ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్ నేత్రత్వంలో సాగుతున్న ఈ ప్రయోగం విజయవంతమైతే పూర్తి స్థాయి స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ.. మొబైల్, ట్రావెలింగ్, డేటా సేకరణ,ట్రెక్కింగ్,మ్యాపింగ్,నౌకలు మరియు విమానయానం వంటి రంగాలలో అందుబాటులోకి రానుంది. అలాగే దీని ద్వారా అందుబాటులోకి వచ్చే స్టాండర్డ్ పొజిషనింగ్ సిస్టమ్ సేవల ద్వారా నిర్దేశించిన వ్యక్తులు లేదా వ్యవస్థలకు రహస్యంగా సమాచారాన్ని చేరవేసే అవకాశం ఏర్పడనుంది. దీంతోపాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలోను, వాహనాలు ప్రయాణించే మార్గాన్ని గుర్తించడంలోను ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్ల సేవలు విరివిగా అందుబాటులోకి రానున్నాయి.
ఈ సేవలు అందుబాటులోకి వస్తే జీపీఎస్ కోసం భారత్ ఇతర దేశాలపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు. గతంలో 1999 లో కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు పాక్ తీవ్రవాదులపై నిఘా కోసం అమెరికాను భారత్ జీపీఎస్ సాంకేతిక సహాయం అందించాలని కోరడం అందుకు అమెరికా ససేమిరా అనడంతో ఎప్పటికైనా సొంత నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడమే మేలు అనే ఆలోచనలోకి వచ్చింది భారత్. దానికి అణుగుణంగానే ఇప్పుడు ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాల ప్రయోగాల్ని విజయవంతంగా పూర్తిచేసింది ఇస్రో.