తొలిసారి: 8ఉప గ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ35 (వీడియో)
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్ర సృష్టించింది. ఒకే వాహకనౌక ద్వారా ఒకేసారి ఎనిమిది ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ35 వాహకనౌక విజయవంతంగా తన పని పూర్తిచేసింది. దీంతో అంతరిక్షయానంలో భారత కీర్తి పతాక మరోసారి రెపరెపలాడింది.
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ దావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి పీఎస్ఎల్ వీ - సీ 35 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. సోమవారం ఉదయం 9.12 గంటలకు ఇగ్నిషన్ ఇవ్వగా, ఆపై నెమ్మదిగా లేచిన రాకెట్, క్షణాల్లో వేగం పుంజుకొని నింగిలోకి దూసుకెళ్లింది.
సోమవారం ఉదయం 9.12 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన వాహకనౌక ఉపగ్రహాలను రెండు విభిన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఇలాంటి ప్రయోగం ఇస్రో నిర్వహించడం ఇదే తొలిసారి. శనివారం ఉదయం ప్రారంభమైన 48 గంటల కౌంట్డౌన్ పూర్తి కాగానే పీఎస్ఎల్వీ-సీ35 నింగిలోకి దూసుకెళ్లింది.
పీఎస్ఎల్వీ-సి35 ద్వారా మన దేశానికి చెందిన స్కాట్శాట్-1 ఉపగ్రహంతో పాటు అల్జీరియా, కెనడా, అమెరికా దేశాలకు చెందిన మరో ఏడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. వీటి మొత్తం బరువు 675 కిలోలు. భూమికి 730 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలో వీటిని ప్రవేశపెట్టారు.
కాగా, శాటిలైట్లు పనిచేయడం ప్రారంభిస్తే, దేశంలో పెను తుపానులు, సునామీల ముప్పును ముందుగానే అంచనా వేసే సాంకేతిక సామర్థ్యం మన దేశ పరమవుతుంది.
2017లో అంగారక గ్రహానికి సంబంధించి కీలక ప్రయోగాలకు ఇస్రో ప్రణాళికలు వేసిన నేపథ్యంలో ఈ ప్రయోగం విజయవంతం కావడం దేశానికి గర్వకారణమని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇస్రో శాస్త్రవేత్తలపై మోడీ ప్రశంసలు
భారత శాస్త్రవేత్తలు చరిత్రను తిరగరాస్తున్నారని, ఒకే రాకెట్ ద్వారా రెండు వేర్వేరు కక్ష్యల్లో ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టడం సామాన్యమైన విషయం కాదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. పీఎస్ఎల్వీ - సీ 35 ప్రయోగం విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ, ప్రధాని తన అధికార ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టారు.
'ఇవి చాలా అపురూపమైన, గర్వించదగ్గ క్షణాలు' అని ఆయన అన్నారు. భారత శాస్త్రవేత్తలు ప్రతిసారీ చరిత్రను లిఖిస్తూనే ఉన్నారని, వారి సృజనాత్మకత ప్రపంచవ్యాప్తంగా ఇండియాను గర్వపడేలా చేస్తోందని అన్నారు.