దొరికిన జాడ: జాబిల్లికి ఉత్తర ధృవం వైపు విక్రమ్ ల్యాండర్: ధృవీకరించిన ఇస్రో
బెంగళూరు: యావత్ భారత దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ ఆచూకీ ఎట్టకేలకు లభించింది. చంద్రుడి ఉత్తర ధృవం వైపు విక్రమ్ ల్యాండర్ పరిభ్రమిస్తున్నట్లు భారత అంతిరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ కే శివన్ ధృవీకరించారు. విక్రమ్ ల్యాండర్ తో తెగిన సంకేతాలను పునరుద్ధరించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. విక్రమ్ ల్యాండర్ ఆచూకీని చంద్రయాన్-2 ఆర్బిటర్ గుర్తించిందని తెలిపారు. అదే ఆర్బిటర్ ద్వారా విక్రమ్ ల్యాండర్ తో సంకేతాలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామని, మరి కొన్ని గంటల్లో ఇది సాధ్యపడుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విక్రమ్ ల్యాండర్ లో అమర్చిన అన్ని పరికరాలు సజావుగా పని చేస్తున్నట్లు గుర్తించామని అన్నారు.
36 గంటల్లో..
కోట్లాదిమంది భారతీయుల ఆశలు, కలలను తన వెంట మోసుకెళ్లిన చంద్రయాన్ - 2.. చిట్ట చివరి నిమషంలో గతి తప్పింది. ఈ నెల 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 నుంచి 2:30 గంటల మధ్యలో చంద్రుడిపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. దీనితో- ఈ ప్రయోగం విఫలమైనట్లు శివన్ ప్రకటించారు. విక్రమ్ ల్యాండర్ కోసం అన్వేషిస్తున్నామని అన్నారు. అప్పటి నుంచి శాస్త్రవేత్తల అన్వేషణ కొనసాగుతూనే వచ్చింది. వారి ప్రయత్నాలు విఫలం కాలేదు. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు స్తంభించిపోయిన సుమారు 36 గంటల వ్యవధిలోనే దాన్ని గుర్తించారు. బెంగళూరులోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలను తెగిపోయిన అనంతరం విక్రమ్ ల్యాండర్.. క్రమంగా ఉత్తర ధృవం వైపు కదులుతున్నట్లు తేలింది.
ఆర్బిటర్ లో హైబీమ్ కెమెరా కీలకం..
విక్రమ్ ల్యాండర్ లోని మూడు అతి కీలక పరికరాల్లో ఆర్బిటర్ ఒకటి. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్, ఆర్బిటర్.. ఈ మూడూ చంద్రయాన్-2 ప్రాజెక్టులో అత్యంత కీలకం. అందులో అమర్చిన ఆర్బిటర్ ద్వారానే ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ జాడను కనుగొన్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఆర్బిటర్ లో అమర్చిన హైబీమ్ కెమెరాలోని పరికరాలతో ల్యాండర్ జార బయటపడినట్లు తెలుస్తోంది. ఈ కెమెరాల రిజల్యూషన్ 0.3. ఈ కెమెరా ఆటోమేటిక్ గా తీసిన థర్మల్ ఫొటో ద్వారా ల్యాండర్ ఎక్కడ?, ఎలా?, ఏ పరిస్థితుల్లో ఉంది?, ల్యాండర్ పనితీరు ఎలా ఉంది? చంద్రుడి ఉపరితలానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో అది పరిభ్రమిస్తోంది? అనే వివరాలను తెలుసుకోగలిగామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ల్యాండర్ జాడ కనుగొనగలిగారు గానీ.. దానితో సంబంధాలను పునరుద్ధరించుకోవడం ఇంకా మిగిలి ఉంది.
సంబంధాల పునరుద్ధరణ ఎలా?
నిజానికి- భూ కక్ష్యను అధిగమించి, చంద్రుడి కక్ష్యలోకి అడుగు పెట్టిన తరువాత.. విక్రమ్ ల్యాండర్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. గ్రౌండ్ స్టేషన్ నుంచి అందే సంకేతాలు గానీ, సమాచారం గానీ దాన్ని ప్రభావితం చేయలేవు. విక్రమ్ ల్యాండర్ కదలికలను మాత్రమే ఇస్రో పరిశీలించడానికి అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో విక్రమ్ ల్యాండర్ తో సంబంధాలను పునరుద్ధరించుకోవడంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. తమ మేథస్సును మథిస్తున్నారు. సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి గల అన్ని రకాల అవకాశాలనూ వారు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ల్యాండర్ ను తమ ఆధీనంలోకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. బెంగళూరు శివార్లలోని బ్యాలాలు, హసన్ సమీపంలో ఏర్పాటు చేసిన గ్రౌండ్ స్టేషన్ల ద్వారా నిరంతరాయంగా ల్యాండర్ కు సంకేతాలను పంపిస్తున్నారని, అందులో ఏ ఒక్క సంకేతాన్నయినా ఆర్బిటర్ లేదా ల్యాండర్ లో అమర్చిన ఇతర పరికరాలు పసిగట్టగలిగితే.. దాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవచ్చని అంటున్నారు.