చంద్రయాన్-2..తొలి డేటా: ఫొటోలతో సహా బహిర్గతం: ఇస్రో: ఇక చంద్రయాన్-3
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-2కు సంబంధించిన తొలి డేటా విడుదలైంది. ఇస్రో శాస్త్రవేత్తలు దీన్ని విడుదల చేశారు. చంద్రయాన్-2 మిషన్ అందించిన డేటా తొలి సెట్ను ఇస్రో విడుదల చేయడం ఇదే తొలిసారి. మూన్ మిషన్ సేకరించిన వివరాలు, చంద్రుడిపై ఇప్పటిదాకా సాగించిన ప్రయోగాలకు సంబంధించిన ప్రాథమిక డేటా ఇందులో పొందుపరిచారు. బెంగళూరు శివార్లలోని బైలాలు వద్ద ఇస్రో డేటా రిసీవర్ సెంటర్ ఉంది. ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలకు సంబంధించిన వివరాలన్నీ ఈ కేంద్రానికి అందుతుంటాయి.
Recommended Video
చంద్రయాన్-2 మూన్ మిషన్ సేకరించిన ప్రాథమిక డేటా ఈ కేంద్రానికి అందింది. దీన్ని క్రోడీకరించిన అనంతరం.. ఇస్రో శాస్త్రవేత్తలు దాన్ని బహిర్గతం చేశారు. ఫొటోలను కూడా విడుదల చేశారు. గత ఏడాది జులై 22వ తేదీన నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి చంద్రయాన్-2ను అంతరిక్షంలోకి పంపించారు శాస్త్రవేత్తలు. అదే ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన ఇది చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి నిరంతరాయంగా జాబిల్లికి సంబంధించిన వివరాలను సేకరించి, ఇస్రో డేటా కేంద్రానికి పంపిస్తోంది.
ప్లానెటరీ డేటా సిస్టమ్-4 (పీడీఎస్-4) ఫార్మట్లో అందిన దీని వివరాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి అడుగు పెట్టినప్పటి నుంచీ ఈ ఏడాది ఫిబ్రవరి వరకు సేకరించిన డేటా వివరాలు అవి. చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి, హైడెఫినిషన్లో ఫొటోలను తీయడానికి అమర్చిన టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా-2 ద్వారా హైరిజల్యూషన్తో కూడిన ఫొటోలు తమకు అందినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. టోపోగ్రఫిక్ మ్యాప్స్, డిజిటల్ ఎలివేషన్ మోడల్స్ రూపంలో వాటిని బదలాయించినట్లు తెలిపారు. ఆర్బిటర్ హై-రిజల్యూషన్ కెమెరాను దీనికోసం వినియోగించినట్లు చెప్పారు.
First set of #Chandrayaan2 payload's data are publicly released for wider science use.
— ISRO (@isro) December 24, 2020
For details visithttps://t.co/bRc4m8S5Aghttps://t.co/kSXPvlNo6Lhttps://t.co/wvGfY5YkdU pic.twitter.com/5ucD6flNNZ
చంద్రయాన్-2 మూన్ మిషన్లో భాగంగా.. జాబిల్లి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ను దింపడానికి ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఫలించని విషయం తెలిసిందే. చంద్రుడిపై ల్యాండ్ అయ్యే సమయంలో.. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు తెగిపోయాయి. చంద్రుడి ఉపరితలం నుంచి ఏడు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ల్యాండర్ వేగాన్ని నియంత్రించలేకపోవడం వల్ల అది క్రాష్ ల్యాండ్ అయినట్లు అనంతరం నిర్ధారించారు. ఈ ప్రయోగం వికటించినప్పటికీ.. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన శాటిలైట్ మాత్రం నిరంతరాయంగా పని చేస్తూనే ఉంది. చంద్రయాన్-3 మిషన్ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.