ఎవరూ చూడని చంద్రుడి మరో ముఖం: ఎత్తు పల్లాలు..లోతైన బిలాలు: ఫొటోలు తీసిన చంద్రయాన్ 2 ఆర్బిటర్
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్ థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 ప్రయోగంలో భాగమైన ఆర్బిటర్ తాజాగా జాబిల్లి ఉపరితలానికి సంబంధించిన కొన్ని ఫొటోలను పంపించింది. ఈ ఫొటోలన్నీ చందమామకు అవతలి వైపు ఉత్తర ధృవానికి సంబంధించినవి. ఆర్బిటర్ లో అమర్చిన ఇమేజింగ్ ఇన్ ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ (ఐఐఆర్ఎస్) ద్వారా తీసినవి. సూర్య కిరణాలను ప్రసరించిన తరువాత చంద్రుడి ఉపరితలం మీద చోటు చేసుకున్న చీకటి వెలుగులు, అక్కడి ఎత్తు పల్లాలు, లోతైన బిలాలను విశ్లేషిస్తూ ఆర్బిటర్ ఈ ఫొటోలను తీసింది.
బెంగళూరులోని గ్రౌండ్ స్టేషన్ కు అందిన ఆ ఫొటోలను ఇస్రో శాస్త్రవేత్తలు తమ ట్విట్టర్ లో పోస్టు చేశారు. చంద్రుడి ఉపరితల గర్భంలో నిక్షిప్తమై ఉన్నట్టుగా భావిస్తోన్న కర్బనాలు, ఇతర మూలకాల గురించి అధ్యయనం చేయడానికి ఈ ఫొటోలు ఉపయోగపడతాయని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సూర్య కిరణాలు చంద్రుడి మీద పడిన తరువాత చోటు చేసుకునే పరిస్థితులపై వారు అధ్యయనం చేస్తున్నారు.
సూర్య కిరణాలు పడిన ప్రాంతాల్లో కొన్ని చోట్ల వెలుగు అధికంగా ఉండటం, మరి కొన్ని చోట్ల తక్కువగా ఉండటానికి కారణం.. ఉపరితల గర్భంలో ఉన్న ధాతువులే కారణమని అభిప్రాయ పడుతున్నారు. సూర్య కిరణాల ప్రభావానికి గురైన కొన్ని ధాతువులు గానీ కర్బనాలు గానీ పెద్దగా ప్రకాశిస్తాయని, మరి కొన్ని ఆ స్థాయిలో ప్రకాశించకపోవడం వల్లే వెలుగుల్లో తేడాలు చోటు చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు.
#ISRO
— ISRO (@isro) October 17, 2019
See the first illuminated image of the lunar surface acquired by #Chandrayaan2’s IIRS payload. IIRS is designed to measure reflected sunlight from the lunar surface in narrow and contiguous spectral channels.
For details visit:https://t.co/C3STg4H79S pic.twitter.com/95N2MpebY4
ఆర్బిటర్ ఫొటోలు తీసిన ప్రదేశంలో చంద్రుడి ఉపరితలంపై సోమర్ఫీల్డ్, కిర్క్వుడ్, స్టెబిన్స్ అనే బిలాలను గుర్తించారు. విక్రమ్ ల్యాండర్ తో అనుసంధానం కావడానికి ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో చంద్రుడిపై పరిశోధనలు సాగించడానికి వారికి ఉన్న ఏకైక ఆధారం ఈ ఆర్బిటర్. దీని జీవిత కాలం ఏడాది మాత్రమే. ల్యాండర్ ను కోల్పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రుడిపై విస్తృతంగా పరిశోధనలు సాగించడానికి ఆర్బిటర్ జీవిత కాలాన్ని పొడిగించాలని నిర్ణయించారు