భలేగున్నాయి: చంద్రుడి హైరిజల్యూషన్ ఫోటోలను విడుదల చేసిన ఇస్రో
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శుక్రవారం చంద్రుడికి సంబంధించిన హైరిజల్యూషన్ ఫోటోలను విడుదల చేసింది. చంద్రయాన్-2కు సంబంధించిన ఆర్బిటార్ తన హైరిజల్యూషన్ కెమెరాతో ఈ ఫోటోలను తీసిందని ఇస్రో వెల్లడించింది. చంద్రుడికి అత్యంత సమీపంగా ఈ ఫోటోలను ఆర్బిటార్ తీసిందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి.ఈ ఫోటోలను ట్విటర్ ద్వారా ఇస్రో షేర్ చేసింది.
ఆర్బిటార్ తీసిన ఫోటోలను పోస్టు చేసిన ఇస్రో ఈ ఫోటోలను గతనెలలో ఉదయం 4 గంటల 38 నిమిషాలకు తీయడం జరిగిందని వెల్లడించింది. చంద్రుడికి కేవలం 100 కిలోమీటర్ల ఎత్తునుంచి ఈ ఫోటోలు తీశారని పేర్కొంది. ఇక దక్షిణ ధృవప్రాంతంలో కూడా ఆర్బిటార్ ఫోటోలు తీసినట్లు ఇస్రో పేర్కొంది.బోగుస్లాస్కీ ఈ క్రేటర్కు సంబంధించిన ఫోటోలను ఇస్రో తీసింది. ఈ క్రేటర్ 14 కిలోమీటర్ల వ్యాసం మరియు 3 కిలోమీటర్ల లోతు ఉన్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ క్రేటర్కు జర్మనీకి చెందిన ప్రముఖ వ్యోమగామి బోగుస్లాస్కీ పేరును పెట్టారు. ఇక ఆర్బిటార్ తీసిన ఫోటోలను పరిశీలించిన తర్వాత చంద్రుడిపై క్రేటర్లు మరియు బండరాళ్లు ఉన్నాయనేది స్పష్టం అవుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలకు ఈ ఫోటోలు ఉపకరిస్తాయని ఇస్రో తెలిపింది.
ఆర్బిటార్లో ఉన్న హైరిజల్యూషన్ కెమెరా 100 కి.మీ కక్ష్య నుండి 25 సెం.మీ. మరియు 3 కి.మీ.ల ప్రాదేశిక రిజల్యూషన్తో, చంద్రుడి కక్ష్య నుంచి హైక్వాలిటీ ఫోటోలను తీస్తోంది. ఎంచుకున్న ప్రాంతాల నుంచి చంద్రుడి పై అధ్యయనాలకు OHRC ఒక కొత్త సాధనంగా అవతరించిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ ఇస్రో గ్రౌండ్ స్టేషన్తో సెప్టెంబర్ 7న సంబంధాలు కోల్పోయింది.
#ISRO
— ISRO (@isro) October 4, 2019
Have a look at the images taken by #Chandrayaan2's Orbiter High Resolution Camera (OHRC).
For more images please visit https://t.co/YBjRO1kTcL pic.twitter.com/K4INnWKbaM
చివరి నిమిషంలో విక్రమ్ ల్యాండర్ గాడి తప్పడంతో ఇది జరిగింది. ఆ తర్వాత విక్రమ్ ల్యాండర్తో సంబంధాలు పునరుద్ధరించడంలో ఇస్రో విఫలమైంది. విక్రమ్ ల్యాండర్లోనే రోవర్ ప్రగ్యాన్ ఇమిడి ఉంది. మరోవైపు ఆర్బిటార్ మాత్రం చంద్రుడి కక్ష్యలో సురక్షితంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతోంది. ఎప్పటికప్పుడు చంద్రుడిపై చోటుచేసుకుంటున్న పరిణామాలకు సంబంధించి ఫోటోలు తీస్తూ భూమికి పంపుతోంది.