చంద్రయాన్ -2: చంద్రుడి ఆవిర్భావం ఎలా జరిగింది... టీజర్ విడుదల చేసిన ఇస్రో
భారత్ అంతరిక్ష పరిశోధన రంగంలో ఓ కలికితురాయిగా చెప్పుకునే చంద్రయాన్ -2 మిషన్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. అయితే ఈ మిషన్ గురించి చాలామంది క్యూరియాసిటీతో ఉన్నారు. అసలు ఈ మిషన్ ఏంటి.. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయనే విషయాలను తెలుసుకోవాలనే ఉత్సుకత చాలామందిలో ఉండటంతో ఇస్రో కొంత వరకు దీనికి సంబంధించిన అంశాలను వెల్లడించింది భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో.
జూలై 15న నింగిలోకి చంద్రయాన్ 2
చంద్రయాన్-2. భారత అంతరిక్ష సంస్థ సగర్వంగా నింగిలోకి పంపనున్న మిషన్. జూలై 15న ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేయగా ఇప్పటికే కౌంట్డౌన్ ప్రారంభమైంది. చంద్రయాన్ -2 గురించి అనేక ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. ఈ చంద్రయాన్ -2 ప్రాజెక్టు గురించి ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు వారిలో ఉన్న ఆసక్తికి సమాధానం చెప్పేందుకు ఇస్రో ఒక చిన్న టీజర్ను విడుదల చేసింది. అసలు చంద్రుడు పుట్టుక ఎలా జరిగింది అనే ప్రశ్నకు నాలుగు థియరీలతో కూడిన సమాధానం ఇస్తూ ఐదో ప్రత్యామ్నాయంను చాలామంది శాస్త్రవేత్తలు పరిగణలోకి తీసుకోలేదని తెలిపింది.
ఇస్రో చెప్పిన నాలుగు థియరీలు:
ఫిజన్ థియరీ (విచ్ఛిన్న సిద్ధాంతం) ప్రకారం భూమి భ్రమణ వేగంతో చంద్రుడు భూమినుంచి వేరుపడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమి భ్రమణ వేగం ఎక్కువగా ఉండటం వల్ల గురుతాకర్షణ శక్తి కూడా పెరిగి విచ్చిన్నం అయిన పదార్థాలు ఒక్కటిగా అయి అదే భూమికి సహజ గ్రహంగా మారిందని చెబుతున్నారు. క్యాప్టివ్ సిద్ధాంతం ప్రకారం భూమి యొక్క గురుతాకర్షణ చేత బంధించబడటానికి ముందే ఓ రూపం దాల్చిందని స్పష్టం చేశారు. ఇక మూడోదిగా ఓ పెద్ద మేఘం క్రో అక్రెషన్ పద్దతి ద్వారా విడుదల చేసిన వాయువుతో భూమి చంద్రడు ఏర్పడ్డాయని చెప్పారు. నాలుగో సిద్ధాంతం ప్రకారం అంతరిక్షంలో తేలియాడే ఇతర ఖగోళ శకలాలను భూమి ఢీకొన్న సమయంలో కొంత విడిపోయి చంద్రుడిగా ఏర్పాటైందని చెబుతున్నారు. ఈ నాలుగు సిద్ధాంతాలకు చంద్రయాన్-2 చంద్రుడు ఆవిర్భావం ఎలా జరిగిందనే ప్రశ్నకు సమాధానం ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
చంద్రయాన్-2 గురించి క్లుప్తంగా...
సోమవారం ఉదయం 2 గంటల 51 నిమిషాలకు జీఎస్ఎల్వీ ఎంకే III రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఇందులో విక్రమ్ అనే ల్యాండర్ ప్రొగ్యాన్ అనే రోవర్ను అమర్చారు. ఇది సెప్టెంబర్ 6వ తేదీన చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు సహకరిస్తుంది. ఈ ప్రాజెక్టు మొత్తంపై టెస్టింగ్ ఇతరత్ర కార్యక్రమాలన్ని గత ఆదివారం నుంచి శరవేగంగా జరిగిపోతున్నాయి. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట వేదిక కానుంది. 2008లో తొలిసారిగా చంద్రయాన్ను ఇస్రో చంద్రుడిపైకి పంపింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో పాటు చంద్రుడి ఉపరితలంపై నీటి ఆనవాలు ఉన్నట్లు గుర్తించింది. చంద్రుడి దక్షిణ ధృవంకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే అత్యధిక నీటి ఆనవాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర దృవంతో పోలిస్తే దక్షిణ ధృవం ఎక్కువగా అంధకారంలో ఉంటుంది.
మొత్తానికి చంద్రుడు ఆవిర్భావం గురించి నాలుగు సిద్ధాంతాల గురించి మాత్రమే శాస్త్రవేత్తలు చర్చించుకుంటున్నారని ఐదో ప్రత్యామ్నాయ సిద్ధాంతం చంద్రయాన్ -2 ద్వారా బయటకు వస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు ఆవాభావం వ్యక్తం చేస్తున్నారు.