సుప్రీం కోర్టు ఆదేశం: మానసికంగా హింసించారు...ఆయనకు రూ.50 లక్షలు చెల్లించండి
ఢిల్లీ: 1994లో గూఢచర్యం కేసులో ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబీ నారాయణ్ అరెస్టు అయ్యారు. శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఆయన్ను కేరళ పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని, మానసకి వేదనకు లోనైనట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. నంబీ నారాయణ్ అరెస్టు అక్రమమని, అతన్ని చిత్రహింసలకు, మానసిక వేదనకు గురిచేసినందుకు గాను నంబినారాయణ్కు రూ. 50 లక్షలు చెల్లించాలని కేరల పోలీసులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆదేశాలు జారీచేశారు. అంతేకాదు నంబీ నారాయణ్ ఆరోపణల్లో వాస్తవం ఎంతో కేరళ పోలీసులను విచారణ చేసి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు మాజీ జడ్జి డీకే జైన్ను కోరింది.
సుప్రీం తీర్పుతో మనసు కుదుటపడింది
"నన్ను క్రిమినల్, కుట్రదారుడు అని ఇక పిలవకూడదు. నాపై అసత్య ఆరోపణలు చేసి అక్రమ కేసులు పెట్టారు. నాకు ఎంతో క్షోభ కలిగించింది. అదేసమయంలో చిత్రహింసకు గురయ్యాను. మానవత్వం మరిచి ప్రవర్తించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో నా మనస్సు కొంత కుదుటపడింది" అని నంబీ నారాయణ్ చెప్పారు. ఇప్పటికే వయస్సు మీదపడిందని చెప్పిన నారాయణ్ తన కుటుంబంతోనే ఇకపై గడుపుతానని వెల్లడించారు.
1996లో కేసు సీబీఐకి బదిలీ
ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసిన నారాయణ్... క్రయోజెనిక్స్ శాఖకు ఇంఛార్జ్గా వ్యవహరించారు. ఆ సమయంలోనే రహస్యాలను చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై నంబీనారాయణ్ను అరెస్టు చేశారు. కేరళ పోలీసుల నుంచి సీబీఐకి కేసు 1996లో బదిలీ అయ్యింది. నంబీ నారాయణ్ పై వచ్చిన ఆరోపణలకు రుజువులు లేవని చెబుతూ సీబీఐ కేసును మూసేసింది. అంతేకాదు విచారణ సందర్భంగా కేరళ పోలీసులు నిబందనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ.. వారిపై చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక సమర్పించింది.
హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన నంబీ నారాయణ్
1998లో నంబీనారాయణ్తో పాటు అరెస్టయిన పలువురికి రూ.లక్ష పరిహారం చెల్లించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది.దీన్ని కేరళ ప్రభుత్వమే చెల్లిచాలని ఆదేశాలు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. నాటి పోలీస్ అధికారులు సిబి మాథ్యూ, కేకే జోష్వా,ఎస్.విజయన్లపై చర్యలు తీసుకోరాదాన్న హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు నంబీ నారాయణ్. ఈ కేసును విచారణ చేసిన సుప్రీంకోర్టు పైవిధంగా స్పందించింది.
లిక్విడ్ ఫ్యూయెల్ రాకెట్ టెక్నాలజీని భారత్కు పరిచయం
1970వ దశకంలో భారత్కు తొలిసారిగా లిక్విడ్ ఫ్యూయెట్ రాకెట్ టెక్నాలజీని నంబీ నారాయణే పరిచయం చేశారు. 1994లో మాల్దీవులకు చెందిన ఇద్దరు ఇంటెలిజెన్స్ అధికారులకు రక్షణ వ్యవస్థకు సంబంధించిన రహస్యాలు చేరవేశారనే ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేశారు కేరళ పోలీసులు. రాకెట్ సమాచారం, ఉపగ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయన లీక్ చేశారని ఆరోపించారు నాటి రక్షణశాఖ అధికారులు. నంబీ నారాయణ్తో పాటు మరొక శాస్త్రవేత్త శశికుమారన్తో కలిసి ఇస్రో రహస్యాలను కొన్ని కోట్లకు అమ్మేశారని ఆరోపణలు చేశారు. దీంతో నారాయణ్ను పోలీసులు అరెస్టు చేశారు. 50 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపారు నంబీ నారాయణ్. ఆ తర్వాత సీబీఐ విచారణ చేసి నంబీపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టేసింది.