ఇస్రో సరికొత్త ప్రయోగం... విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ50...
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) గురువారం(డిసెంబర్ 17) పీఎస్ఎల్వీ-సీ50 వాహక నౌక ద్వారా కమ్యూనికేషన్ సీఎంఎస్-01 శాటిలైట్ను విజయవంతంగా నింగిలోకి పంపించింది. సీఎంఎస్-01 శాటిలైట్ను పీఎస్ఎల్వీ-సీ50 నిర్ణీత కక్ష్యంలో ప్రవేశపెట్టనుంది. ఇది భారత్ ప్రయోగించిన 42వ కమ్యూనికేషన్ శాటిలైట్. దీని బరువు 1410 కిలోలు.
Recommended Video
బుధవారం మధ్యాహ్నం 2.41గంటలకు ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రారంభమవగా.. గురువారం సాయంత్రం 3.41గంటలకు పీఎస్ఎల్వీ-50 నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ ఆకృతిలో 22వది కాగా... షార్ నుంచి ఇది 77వ మిషన్ అని ఇస్రో వెల్లడించింది.
తాజాగా నింగిలోకి పంపించిన సీఎంఎస్-01 ద్వారా భారత్లో మరింత మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
భారత్తో పాటు అండమాన్ నికోబార్ దీవులు,లక్షద్వీప్ వరకూ దీని సేవలు అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు.శ్రీహరి కోటలో రాకెట్ ప్రయోగానికి ముందు శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు సమాచారం.