నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ మార్క్ 3డీ1: ఎన్నో ప్రయోజనాలు
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన జీఎస్ఎల్వీ మార్క్ 3డీ1ను శ్రీహరి కోటలోని షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి విజయవంతంగా నింగిలోకి పంపింది.
నెల్లూరు: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన జీఎస్ఎల్వీ మార్క్ 3డీ1ను శ్రీహరి కోటలోని షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి విజయవంతంగా నింగిలోకి పంపింది.
భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.28 నిమిషాలకు జీఎస్ఎల్వీ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగాన్ని ఇస్రో ఛైర్మన్ ఎఎస్ కిరణ్ కుమార్ పర్యవేక్షించారు.
ఈ ప్రయోగం కోసం దాదాపు 25.30 గంటలు కౌంట్డౌన్ సాగింది. ఇస్రో ఇప్పటి వరకూ ప్రయోగించిన రాకెట్లలోకి ఇదే అతిపెద్దది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజిన్ దీనిలో వినియోగించారు.
దీనిద్వారా 3,136 కిలోల బరువు గల జీశాట్ 19 సమాచార ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.
ఈ రాకెట్ బరువు 640 టన్నులు. ఎత్తు 43 మీటర్లు. ఇందులో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో ఎస్200 మోటార్లు రెండు, రెండో దశలో ఎల్110 లిక్విడ్ కోర్ ఇంజిన్, మూడో దశలో సీ25 క్రయోజెనిక్ ఇంజిన్ ఉన్నాయి.
ప్రయోగం అనంతరం 16.20 నిమిషాలకు జీశాట్ 19 ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోనుంది. ఇది భూ అనువర్తిత బదిలీ కక్ష్య (జీటీవో)లోకి 4వేల కిలోలను, దిగువ భూ కక్ష్యలోకి 8వేల కిలోలను మోసుకెళ్తుంది.
ఎన్నో ప్రయోజనాలు
ఈ ప్రయోగం విజయవంతమైతే అత్యంత బరువైన ఉపగ్రహాలను మన గడ్డ నుండే కక్షలోకి పంపే సత్తా చేకూరుతుంది. భారీ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు ఇస్రో ఇప్పటి వరకు ఏరియన్ రాకెట్పై ఆధారపడుతోంది. ఇకపై ఆ అవసరం ఉండదు. రూ.400 కోట్ల మేర ఖర్చు తగ్గుతోంది. 4,500-5,000 కిలోల బరువు గల ఇన్శాట్ 4 తరహా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టే స్థాయికి ఇస్రో ఎదుగుతోంది. మానవసహిత యాత్రలకూ వీలు కలుగుతుంది. గురుడు, శుక్రుడు వంటి గ్రహాల వద్దకు వ్యోమనౌకలను పంపే వీలు ఉంటుంది.