చంద్రయాన్-2 గుడ్ న్యూస్: ఇక జాబిల్లి కక్ష్యలో.. క్లిష్ట దశకు చేరుకున్న మూన్ మిషన్!
బెంగళూరు: మరి కొన్ని గంటలు. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్.. మరో అంకాన్ని పూర్తి చేయబోతోంది. ప్రయోగించినప్పటి నుంచీ ఇప్పటిదాకా భూ కక్ష్యలోనే పరిభ్రమిస్తోన్న విక్రమ్ స్పేస్ క్రాఫ్ట్.. ఇక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించబోతోంది. ఇస్రో శాస్త్రవేత్తలు మంగళవారం దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తి చేయనుంది. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించడానికి అవసరమైన ద్రవరూపంలో ఉన్న ఇంధనాన్ని మండించడం వల్ల దాని స్పేస్ క్రాఫ్ట్ వేగం పెరుగుతుంది.
భూకక్ష్యను దాటుకుని చంద్రుని కక్ష్యలోనికి ప్రవేశించడానికి అవసరమైన వేగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఈ స్పేస్ క్రాఫ్ట్ కు కల్పించనున్నారు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్యలో తాము చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ ను చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెడతామని ఇస్రో ఛైర్మన్ కే శివన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు మొత్తంలోకి ఇదే అత్యంత క్లిష్టమైన దశగా ఆయన అభివర్ణించారు. దీన్ని విజయవంతంగా పూర్తి చేయగలమని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ ను ఇస్రో కిందటి నెల 22వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి ప్రయోగించిన విషయం తెలిసిందే. మూడు దశల్లో ఈ చంద్రయాన్-2 కొనసాగుతోంది. ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. చంద్రుడి కక్షకు అతి సమీపంలో పరిభ్రమిస్తోంది. అందులోకి ప్రవేశించడమే మిగిలి ఉంది. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత కూడా నాలుగు దశలను పూర్తి చేసుకున్న తరువాతే చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపై దిగగలుగుతుంది.
క్రమంగా చంద్రుడి ధృవాల వైపు ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల దూరంలోకి చేరుకుంటుంది. అదే చివరి దశ. వచ్చేనెల 2వ తేదీ నాటికి చివరి దశ పరిభ్రమణానికి చేరుకుంటుందని ఇస్రో అధికారులు వెల్లడించారు. విక్రమ్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి విడివడిన అనంతరం చంద్రయాన్-2 చంద్రుడి ధృవాలపై కాలు మోపుతుంది. వచ్చేనెల 7వ తేదీన చంద్రయాన్-2 జాబిల్లిపై అడుగు పెడుతుందని శివన్ తెలిపారు. దక్షిణ ధృవం వైసు కాలు మోపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 14వ తేదీ వరకు అందిన సమాచారం చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణం సజావుగా సాగుతోంది. ఎలాంటి సాంకేతికపరమైన లోపాలు గానీ, ఆటంకాలు గానీ ఎదురు కాలేదు. చంద్రయాన్-2 ప్రయాణాన్ని ఇస్రో అధికారులు ఇస్రో మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ టెలిమెట్రీ విభాగం ద్వారా పరిశీలిస్తున్నారు. బెంగళూరు శివార్లలోని బ్యాలాలు వద్ద నెలకొల్పిన ఇండియన్ డీప్ స్పేస్ నెట్ వర్క్, టెలిమెట్రి, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ ల ద్వారా దాన్ని ఆపరేట్ చేస్తున్నారు.