గగన్యాన్ మిషన్: నింగిలోకి ఆమెను పంపనున్న ఇస్రో..ఇంతకీ ఎవరామే?
Recommended Video
బెంగళూరు: ఆమె మాట్లాడగలదు.. ఆమె మనుషులను గుర్తుపట్టగలదు.. అంతేకాదు అంతరిక్షంలో వ్యోమగాములు ఎలా వ్యవహరిస్తారో కూడా చేసి చూపించగలదు... అంతేకాదు సమావేశాలు నిర్వహించగలదు.. ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. ఇంతకీ ఈమె ఎవరంటారా..? ఇస్రో నింగిలోకి పంపనున్న గగన్యాన్ మిషన్లో ఓ ప్రయాణికురాలు. అయితే మనిషి కాదు.. ఒక రోబో. ఈ రోబో పేరే వ్యోమ్మిత్ర.
గగన్యాన్ మిషన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్: అక్కడికి ఒక్కరు మాత్రమే..!
నింగిలోకి హ్యూమన్ రోబో
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ మిషన్లో ఓ రోబోను నింగిలోకి పంపిస్తోంది. మనిషిని పోలి ఉండే ఈ రోబోను ముందుగా నింగిలోకి పంపనున్నారు. ఆ తర్వాతే అసలు ప్రయోగం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది ఇస్రో. బుధవారం బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ హ్యూమన్ రోబోను ఆవిష్కరించారు. " హాయ్ ఐయామ్ వ్యోమ్మిత్ర ది ఫస్ట్ ప్రొటో టైప్ ఆఫ్ హాఫ్ హూమనాయిడ్" అంటూ సమావేశంకు వచ్చిన మీడియా ప్రతినిధులను పలకరించింది.
అంతరిక్షంలో పలు ప్రయోగాలు చేయనున్న రోబో
ఇస్రో శాస్త్రవేత్తల ప్రకారం వ్యోమ్ మిత్ర అనే ఈ రోబో సగం మనిషి అని చెప్పాలి. ఎందుకంటే దీనికి కాళ్లు లేవు. ఇది కేవలం పక్కకు లేదా ముందుకు వంగగలదు. కొన్ని ప్రయోగాలను చేస్తూనే ఇస్రో కమాండ్ సెంటర్తో టచ్లో ఉంటుందని చెప్పారు ఇస్రో సైంటిస్టు శామ్ దయాల్. ఈ ఏడాది చివరిలోగా వ్యోమ్మిత్రను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో ప్లాన్ చేస్తోంది. గగన్ యాన్ ప్రాజెక్టు కంటే ముందే దీన్ని నింగిలోకి పంపాలని ఇస్రో భావిస్తోంది. భారత్ అంతరిక్ష రంగంలో దూసుకెళుతోందని త్వరలోనే భారత్ నుంచి అంతరిక్షంలోకి మానవుడు వెళతాడని ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా చేసిన ప్రసంగంలో చెప్పారు.
నింగిలోకి ముగ్గురు భారతీయులు
అంతకుముందు వింగ్ కమాండర్ రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లినప్పటికీ ఆయన రష్యా స్పేస్ క్రాఫ్ట్లో ప్రయాణించారు. అయితే గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా నింగిలోకి ముగ్గురు భారతీయులను పంపాలని ఇస్రో భావిస్తోంది. అది కూడా భారత స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన స్పేస్క్రాఫ్ట్లోనే వారిని నింగిలోకి పంపాలని భావిస్తోంది. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన నలుగురు పైలట్లను ఇస్రో సెలెక్ట్ చేసింది. రష్యా భారత్లో వారు శిక్షణ పొందుతారు. అనంతరం ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన డాక్టర్లు కూడా శిక్షణ కోసం ఫ్రాన్స్కు వెళతారు.
ఇప్పటికే స్పేస్ సూట్ ఆవిష్కరించిన ఇస్రో
అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు సంబంధించిన స్పేస్ సూట్ను ఇస్రో ఇప్పటికే ఆవిష్కరించింది. ఇక వ్యోమగాములును అంతరిక్షంలోకి తీసుకెళ్లే జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3 రాకెట్ను కూడా ఇస్రో తయారు చేసింది. 2022 నాటికల్లా మానవుడిని అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో సన్నహాలు చేస్తోంది. అంతకుముందు రెండు మానవరహిత ప్రయోగాలు చేయాలని ఇస్రో భావిస్తోంది. ఇదిలా ఉంటే వ్యోమ్మిత్ర ముందుగా అంతరిక్షంలోకి వెళ్లి కొన్ని ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. తిరిగి ముగ్గురు భారతీయులను 2022లో నింగిలోకి పంపే సమయంలో కూడా వీరితో పాటు వెళుతుందా లేదా అనేదానిపై మాత్రం స్పష్టత లేదు.