చంద్రయాన్-2కు ముందు ఇస్రో పై సైబర్ దాడి జరిగిందా..? రిపోర్ట్ చెబుతోందేమిటి..?
కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంకు సంబంధించిన డేటాపై సైబర్ అటాక్ జరిగిన ఘటన మరువక ముందే తాజాగా ఇస్రో పై కూడా హ్యాకర్ల కన్ను పడిందనే సమాచారం ఆందోళనకు గురిచేస్తోంది. ఇస్రో డొమైన్ కంట్రోలర్స్ హ్యాకింగ్కు గురయ్యే అవకాశాలున్నాయని అమెరికా నిఘా వర్గాలు సైబర్ సెక్యూరిటీని పర్యవేక్షించే జాతీయ సైబర్ సమన్వయ కేంద్రంకు సమాచారం అందించాయి. దీన్ని డీట్రాక్ స్పైవేర్గా గుర్తించినట్లు అమెరికా నిఘా వర్గాలు నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్కు సమాచారం ఇచ్చాయి.
చంద్రయాన్ -2: నాసా ఆర్బిటార్కు చిక్కని విక్రమ్ల్యాండర్ జాడ
సెప్టెంబర్ 4న ఇస్రోకు హెచ్చరికలు
డీట్రాక్ అనే స్పైవేర్ లక్ష్యంగా చేసుకున్న సర్వర్లపై దాడి చేసి హ్యాకర్లకు ఆ సంస్థ వినియోగిస్తున్న వివరాలు ఇతర పాస్వర్డ్లను చేరవేస్తుందని అధికారులు తెలిపారు. కూడంకుళంలోని అణువిద్యుత్ కేంద్రం మరియు ఇస్రోలను సెప్టెంబర్ 4వ తేదీనే హెచ్చరించినట్లు నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ వెల్లడించినట్లు సమాచారం. అక్టోబర్ 30వ తేదీన కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంలో ఎలాంటి డేటా హ్యాకింగ్కు గురికాలేదని అధికారులు తెలిపారు. అయితే ఆ తర్వాత ఓ కంప్యూటర్లో మాల్వేర్ను గుర్తించినట్లు నిర్థారించింది అణువిద్యుత్ కేంద్రం. వైరస్టోటల్ . కామ్ అనే ఆన్లైన్ స్కానింగ్ సర్వీసు ద్వారా అసలు విషయం వెలుగు చూసింది.
కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంపై డీట్రాక్ దాడి
ఇక ఇది గుర్తించిన కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం తమ కంప్యూటర్లలో ఓ మాల్వేర్ను గుర్తించినట్లు నిర్థారించింది. పాలనా విభాగంలో వినియోగించే కంప్యూటర్లో డీట్రాక్ స్పైవేర్ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఈ అంశాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అదే సమయంలో ప్లాంట్లోని ఇతర కంప్యూటర్లకు ఎలాంటి హాని కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఇస్రో నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
చంద్రయాన్-2 ప్రయోగంకు కొన్ని గంటల ముందే...
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్-2 టేకాఫ్కు 100 గంటల ముందు ఇస్రో అధికారులకు స్పైవేర్ పై సమాచారం అందడంతో రంగంలోకి దిగి దీనిని గుర్తించే పనిలో పడ్డట్టు సమాచారం. అయితే ఈ స్పైవేర్కు చంద్రయాన్-2కు ఏమైనా సంబంధం ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది. చంద్రుడిపైన విక్రమ్ ల్యాండర్ హార్డ్ క్రాషింగ్ జరగడంతో ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే.
2016లో సౌత్ కొరియా మిలటరీ కేంద్రంపై కూడా...
కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంలో సైబర్ అటాక్ జరిగిందన్న విషయం బహిర్గతం అయ్యాక సియోల్ కేంద్రంగా పనిచేస్తున్న నాన్ ప్రాఫిట్ సంస్థ ఇష్యూ మేకర్స్ ల్యాబ్ ఓ ప్రకటన చేసింది. సౌత్ కొరియా మిలటరీ రహస్యాలు తెలుసుకునేందుకు 2016లో ఏ స్పైవేర్ అయితే దాడి చేసిందో కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంపై కూడా అదే స్పైవేర్ దాడి చేసినట్లు తాము కనుగొన్నామని ఇష్యూ మేకర్స్ ల్యాబ్ సంస్థ వెల్లడించింది. రెండు రోజుల తర్వాత ఉత్తర కొరియా హ్యాకర్ గ్రూప్ బీ కూడంకుళం అణువిద్యుత్ కేంద్రంపై దాడి చేసిన సమాచారంను ఇష్యూ మేకర్స్ ల్యాబ్ ట్వీట్ చేసింది. ఇన్ఫెక్ట్ అయిన కంప్యూటర్లో 16 సంఖ్యల పాస్వర్డ్ వాడినట్లు బయట పెట్టింది.