గాలి జనార్దన్ రెడ్డి సోదరులు, కర్ణాటక మంత్రిపై కేసు, తెలంగాణలో భూములు, గోల్ మాల్ !
హైదరాబాద్/ బెంగళూరు: భూములు కొనుగోలు వ్యవహారంలో తప్పుడు లెక్కలు చూపించి ప్రభుత్వాన్ని మోసం చేశారని ఆరోపిస్తూ కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరులు, ప్రస్తుత కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములుపై ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు బెంగళూరులో కేసు నమోదు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి సోదరులు, మంత్రి బి. శ్రీరాములుపై కేసు నమోదు కావడంతో ఆయన వర్గీయులు ఆందోళనకు గురైనారు.
బళ్లారి రాజకీయాలకు మంత్రి శ్రీరాములు గుడ్ బై ?, నిన్న గాలి జనార్దన్ రెడ్డి, నేడు, సీఎం !
తెలంగాణలో భూములు
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సమీపంలోని లిల్లిపూర్ లో 2005-2006 సంవత్సరంలో రూ. 21.80 కోట్ల విలువైన భూములను గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరులు, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యేలు గాలి కరుణాకర్ రెడ్డి, గాలి సోమశేఖర్ రెడ్డి, కర్ణాటకలోని ప్రస్తుత ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు కొనుగోలు చేశారు.
రూ. 18.15 కోట్లు గోల్ మాల్ !
లిల్లిపూర్ లోని భూములకు సేల్ డీడ్ లో రూ. 3.06 కోట్లకు కొనుగోలు చేసినట్లు గాలి జనార్దన్ రెడ్డి సోదరులు, మంత్రి బళ్లారి శ్రీరాములు చూపించారని, మిగిలిన రూ. 18.75 కోట్లు నగదు రూపంలో ఆ స్థలం విక్రయదారుడికి చెల్లించారని 2007లో ఐటీ శాఖ అధికారులు గుర్తించారు.
నోటీసులు ఇచ్చినా డోంట్ కేర్ !
లిల్లిపూర్ లో భూములు కొనుగోలు చేసే విషయంలో మీరు అవకతవకలకు పాల్పడ్డారని, సమాధానం చెప్పాని ఆదాయపన్ను శాఖ అధికారులు గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి, గాలి సోమశేఖర్ రెడ్డి, మంత్రి శ్రీరాములుకు నోటీసులు ఇచ్చినా వారు ఇంత వరకు స్పందించలేదని ఆరోపణలు ఉన్నాయి. అందుకే అధికారులు ప్రైవేటు కేసు నమోదు చేశారు.
ఎన్నోబుల్ కంపెనీ
గాలి జనార్దన్ రెడ్డి సోదరులకు చెందిన మె. ఎన్నోబుల్ కన్ స్ట్రక్షన్ కంపెనీ నుంచి తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లాలోని లిల్లిపూర్ లో భూములు కొనుగోలు చేశారని ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఆ భూముల కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వానికి రూ. 18.75 కోట్లకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మోసం చేశారని ఆదాయపన్ను శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు.
Recommended Video
బెంగళూరు ప్రత్యేక కోర్టు
గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరులు, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యేలు గాలి కరుణాకర్ రెడ్డి, గాలి సోమశేఖర్ రెడ్డి, మంత్రి బళ్లారి శ్రీరాములుపై నమోదైన కేసు బెంగళూరులోని చట్టసభ ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో వ్యాజ్యం ధాఖలు చేశారు. కేసు తదుపరి విచారణ డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేస్తున్నామని న్యాయమూర్తి జస్టిస్ రామచంద్ర డి. హుద్దర్ తెలిపారు.