ఇరుకునపడ్డ బీజేపీ.. వాళ్లెవరో తేల్చాల్సిందే.. నేతాజీ జయంతి వేడుకలో ఆ నినాదాలపై ఆర్ఎస్ఎస్ రియాక్షన్
ఇటీవల కోల్కతాలో జరిగిన నేతాజీ జయంతి ఉత్సవాల్లో ఒక వర్గం చేసిన 'జై శ్రీరామ్', 'మోదీ-మోదీ' నినాదాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. మోదీతో వేదిక పంచుకున్న మమతా... ఆ నినాదాలకు నిరసనగా తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు. నేతాజీ జయంతి వేడుకల్లో జైశ్రీరామ్ నినాదాలు చేయడం ఆయన గౌరవానికి భంగం కలిగించడమేనని అన్నారు. ఈ వ్యవహారంపై తాజాగా బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ స్పందించింది.
ఆర్ఎస్ఎస్ తీవ్ర అసంతృప్తి...
నేతాజీ జయంతి వేడుకల్లో జైశ్రీరామ్ నినాదాలను తాము సమర్థించమని రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) ప్రకటించింది. నేతాజీకి నివాళులు అర్పించే ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఇలాంటి నినాదాలు చేసి ఉండకూడదని బెంగాల్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి జిష్ణు బసు అభిప్రాయపడ్డారు. 'ఆరోజు జరిగిన దాని పట్ల సంఘ్ చాలా అసంతృప్తితో ఉంది. ఆ కార్యక్రమంలో జైశ్రీరామ్ నినాదాలు చేసినవారు అటు నేతాజీ పట్ల,ఇటు రాముడి పట్ల గౌరవం చూపించనట్లుగానే భావించాలి. ఆ నినాదాలు చేసినవారిని బీజేపీ కచ్చితంగా గుర్తించాలి. దీని వెనకాల ఇంకేదైనా విధ్వంస కుట్ర దాగుందా అన్నది తేల్చాలి.' అని పేర్కొన్నారు.
అనుకూలంగా మార్చుకున్న మమతా...
ఇదే వ్యవహారంపై మరో బీజేపీ నేత మాట్లాడుతూ... 'నేతాజీ జయంతి వేడుకల్లో ఆ నినాదాలు చేసినవారు మరో రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతకు సన్నిహితులుగా తెలుస్తోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆరోజు ప్రధాని పర్యటనను చక్కగా ప్లాన్ చేశారు.కానీ ఈ పరిణామంతో అంతా తలకిందులైనట్లయింది.' అని అభిప్రాయపడ్డారు. ఆ నినాదాలు మమతా బెనర్జీ తనకు అనుకూలంగా మలుచుకున్నారన్నారు.
Recommended Video
బీజేపీని ఇరుకునపెట్టేలా...
బెంగాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... బీజేపీ-తృణమూల్ మధ్య తీవ్ర రాజకీయ ఘర్షణ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో నేతాజీ జయంతి వేడుకల్లో చోటు చేసుకున్న పరిణామం రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపుతుందా అన్న చర్చ జరుగుతోంది.
నేతాజీ జయంతి వేడుకలో ఆ నినాదాలు చేయడం బెంగాల్కు చిహ్నాలైన వ్యక్తులను అవమానపరచడమేనని మమతా ఇదివరకే వ్యాఖ్యానించారు. 'ఎవరినైనా మీ ఇంటికి ఆహ్వానిస్తే... ఆ వ్యక్తిని మీరు అవమానిస్తారా... అది బెంగాల్ సంస్కృతా,దేశ సంస్కృతా...' అని ప్రశ్నించారు. అదే కార్యక్రమంలో నేతాజీని కొనియాడుతూ నినాదాలు చేసి వుంటే తాను హర్షం వ్యక్తం చేసేదాన్ని అన్నారు. మమతా వ్యాఖ్యలు బీజేపీని తీవ్రంగా ఇరుకునపెట్టేవిగా మారాయి. తాజాగా ఆర్ఎస్ఎస్ కూడా ఆ నినాదాలను ఖండించడంతో బీజేపీ ఆత్మరక్షణలో పడినట్లయింది.