టెక్కీలకు శుభవార్త! మొట్టమొదటిసారిగా కర్ణాటకలో ట్రేడ్ యూనియన్ ఏర్పాటు!
దేశంలోనే అతిపెద్ద టెక్ హబ్ అయిన బెంగళూరు, కర్నాటక లేబర్ కమిషన్, ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926,
బెంగళూరు : ఐటీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ఇండస్ట్రీలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తొలిసారిగా బెంగళూరులో ఐటీ ఉద్యోగుల కోసం ట్రేడ్ యూనియన్ ఏర్పాటుకు అనుమతి లభించింది.
దేశంలోనే అతిపెద్ద టెక్ హబ్ అయిన బెంగళూరు, కర్నాటక లేబర్ కమిషన్, ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926, కర్నాటక ట్రేడ్ యూనియన్స్ రెగ్యులేషన్స్ 1958 కింద కర్నాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల యూనియన్(కేఐటీయూ) ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపాయి.
ఇది తమకు ఎంతో ముఖ్యమైన క్షణమని, ఐటీ ఉద్యోగి యూనియన్కు దీనిని తొలుత అంకితమిస్తున్నట్టు కేఐటీయూ జనరల్ సెక్రటరీ వినీత్ వాకిల్ తెలిపారు. చాలా మంది ఐటీ ఉద్యోగులు సమస్యలను ఎదుర్కొంటుండటం వల్ల యూనియన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక సమస్యలన్నింటిన్నీ పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.
కేవలం బెంగళూరులోనే ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసు రంగాల ఉద్యోగులు 1.5 మిలియన్ మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా కనీసం 4 మిలియన్ మంది ఉన్నట్టు సమాచారం. గతేడాది నుంచి ఐటీ రంగంలో పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పెద్ద ఎత్తున్న లేఆఫ్స్, ఎక్కువ పని గంటలు వంటి వాటిని కంపెనీలు చేపడుతున్నాయి. ఆటోమేషన్ ప్రభావంతో కంపెనీలు ఉద్యోగులను భారీ ఎత్తున్న తీసేస్తున్నాయి. అంతేకాక ఇంక్రిమెంట్లు కూడా తగ్గించేశాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో తొలిసారిగా ఐటీ ఉద్యోగుల కోసం యూనియన్ ఏర్పాటు కావడం ఆ రంగ ఉద్యోగులకు భరోసా ఇచ్చే అంశమే.