శుభవార్త: ఐటీలో 10% గ్రోత్, టెక్కీలకు ఇబ్బందిలేదు, కానీ, 4 ఏళ్ళ పాటు కష్టాలే
సాప్ట్ వేర్ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది.పలు కారణాలతో సాప్ట్ వేర్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆ రకమైన పరిస్థితులు ఇక ఉండకపోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి
న్యూఢిల్లీ: సాప్ట్ వేర్ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది.పలు కారణాలతో సాప్ట్ వేర్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆ రకమైన పరిస్థితులు ఇక ఉండకపోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఐటీ కార్యదర్శి అరుణ సుందరరాజన్ ఈ మేరకు ప్రకటించారు.
దేశీయ ఐటి కంపెనీలు తమ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి.అయితే ఈ తరుణంలో కేంద్రం టెక్కీలకు తీపి కబురును అందించింది.అయితే ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో సాప్ట్ వేర్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకొనే పనికి పూనుకొంటున్నాయి.
అయితే ఇదే సమయంలో అమెరికాలో చోటుచేసుకొన్న పరిణామాలు భారత్ ఐటీ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు ట్రంప్ హైర్ అమెరికన్, బై అమెరికన్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను తీసుకువచ్చారు.ఈ ఆర్డర్ కారణంగా భారత్ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
మరో వైపు మారిన పరిస్థితుల కారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు కొన్ని ఖర్చులను తగ్గించుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి.ఇందులో భాగంగానే ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. పనితీరు ఆధారంగా ఉద్యోగులపై చర్యలకు పూనుకొంటున్నాయి. అయితే ఈ ప్రభావంతో ఇండియా టెక్కీలపై తీవ్ర ప్రభావం కన్పిస్తోంది.
ఐటీ లో 8-10% గ్రోత్
దేశీయ ఐటీ రంగంలో నెలకొన్న సంక్షోభంపై కేంద్రం స్పందించింది. టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోత పెద్దగా ఉండబోదని కేంద్రం అభిప్రాయంతో ఉంది. ఐటీ రంగం వృద్ది సాధిస్తోందని కేంద్ర ఐటీ సెక్రటరీ అరుణ సుందర్ రాజన్ భరోసా ఇచ్చారు. ఐటీ రంగంలో 8-10% గ్రోత్ ఉందని ఆమె ప్రకటించారు. భారీగా ఉద్యోగాల కోత ఉంటుందన్న అంచనాలను ఆమె కొట్టిపారేశారు. బ్రాడ్ ఇండియా ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో ఈ విషయాన్ని ఆమె ప్రకటించారు.ఉద్యోగాల కోత ఎక్కువగా ఉండే అవకాశమే లేదన్నారు.
రెండున్నర ఏళ్ళలో 5 లక్షల ఉద్యోగాలు
గత రెండున్నర ఏళ్ళలో 5 లక్షల ఉద్యోగాలను ఐటీ పరిశ్రమ కల్పించిందని అరుణ సుందరరాజన్ చెప్పారు. రానున్నరోజుల్లో కూడ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పారు.అంతేకాకుండా క్లౌడ్, బిగ్ డేటా, డిజిటల్ చెల్లింపులు రావడంతో ఐటీ ఉద్యోగ ప్రోఫైల్ మార్పు చెందుతోందని సుందరరాజన్ అభిప్రాయపడ్డారు. రెగ్యులర్ వార్షిక రివ్యూలో భాగంగానే ఉద్యోగుల తీసివేతలు సాగుతున్నాయని ఆమె చెప్పారు.
రానున్న మూడేళ్ళు గడ్డు కాలమేనంటూ నివేదికలు
అయితే హెడ్ హంటర్స్ ఇండియా వెల్లడించిన నిబంధనలు మాత్రం ఆందోళన కల్గిస్తున్నాయి. రానున్న మరో మూడేళ్ళపాటు ఇదే పరిస్థితిలో టెక్కీలపై వేటు కొనసాగే అవకాశాలు ఉంటాయని హెచ్ హంటర్స్ పేర్కొంది. ప్రస్తుతం ఐటీ సంస్థల్లో సేవలందించే సగం మంది రాబోయే మూడు లేదా నాలుగేళ్ళలో అప్పటి అవసరాలకు అనుగుణంగా ఉండరని హెడ్ హంటర్స్ నివేదిక ఇచ్చింది.రానున్న మూడు లేదా నాలుగేళ్ళలో టెక్నాలజీని అందుకోలేని 1.75 లక్షల నుండి రెండులక్షల మంది ఉద్యోగులపై వేటు పడే అవకాశాలున్నాయని హెడ్ హంటర్స్ సంస్థ ప్రకటించింది.
వీసా నిబంధనల కారణంగానే ఉద్యోగుల తొలగింపు
వీసాల నిబంధనల కారణంగానే కొన్ని సాప్ట్ వేర్ కంపెనీలు తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను తొలగిస్తున్నారనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.అమెరికా, అస్ట్రేలియా లాంటి దేశాల్లో వీసా నిబంధనల కారణంగా సదరు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకొంటున్నట్టు తెలుస్తోందని కేంద్రం చెబుతోంది. కొన్ని సంస్థల్లో కాంట్రాక్టు ఉద్యోగాలను పునరుద్దరించలేదు, ఉద్యోగాల కోత అనేది జరగబోదని చెప్పారు. వార్షిక అంచనాల్లో భాగంగా కాంట్రాక్టులను పునరుద్దరించలేదు. అయితే దీని వల్లే భారీగా ఉద్యోగులపై వేటు ఉంటుందని భావించడం సరైంది కాదని కేంద్రం అభిప్రాయపడింది.