అద్వానీ మౌనం వీడాలి : ఉమాభారతి
ఢిల్లీ : బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 91 ఏళ్ల పార్టీ సీనియర్ నేతకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఆయనకు టికెట్ ఎందుకు రాలేదన్న అంశంపై అటు పార్టీ వర్గాలు గానీ ఇటు అద్వానీ గానీ నోరు మెదపడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఉమాభారతి ఈ అంశంపై స్పందించారు. టికెట్ ఎందుకు ఎవ్వలేదన్న అంశంపై అద్వానీ స్వయంగా క్లారిటీ ఇవ్వాలని కోరారు.
అద్వానీ మౌనం వీడాలి ఉమాభారతి
బీజేపీ ప్రారంభం నుంచి పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన అద్వానీపై ఉమాభారతి ప్రసంశల జల్లు కురిపించారు. ఆయన కారణంగానే నేడు నరేంద్రమోడీ ప్రధాని అయ్యారని అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అద్వానీ ఏనాడూ పదవులకు ఆశపడలేదన్న ఉమాభారతి... ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా ఆయన వ్యక్తిత్వం ఎప్పటికీ సమున్నతంగా ఉంటుందని చెప్పారు. అయితే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఆయనకు ఎందుకు టికెట్ కేటాయించలేదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేయాలని అన్నారు. ఈ విషయంలో ఆయన మౌనాన్ని వీడాలని కోరారు. గాంధీ నగర్ టికెట్ అంశంపై స్పందించే అర్హత తనతో పాటు ఎవరికీ లేదని ఉమాభారతి అభిప్రాయపడ్డారు.
వయోభారం కారణం కాదంటున్న ఉమ
91 ఏళ్ల వయసున్న ఎల్ కే అద్వానీకి వయోభారం కారణంగా టికెట్ ఇవ్వలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వాదనల్ని ఉమ ఖండించారు. పార్టీ హైకమాండ్ వయసును ప్రాతిపదికగా తీసుకుని ఉంటే ఈసారి ఎన్నికల్లో చాలా మంది యువ ఎంపీలకు టికెట్ ఎందుకు నిరాకరించారని ఆమె ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పాకిస్తాన్ లో పోటిచేస్తే గెలుస్తుందోమో, రాంమాధవ్
అద్వానీ స్థానం నుంచి అమిత్ షా పోటీ
1998 నుంచి అద్వానీ గాంధీ నగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో మాత్రం ఆ నియోజకవర్గ టికెట్ ను అమిత్ షాకు కట్టబెడుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే రోజులు గడుస్తున్నా అద్వానీకి గాంధీ నగర్ టికెట్ ఎందుకు ఇవ్వలేదన్న అంశంపై అటు పార్టీ వర్గాలు గానీ ఇటు ఎల్ కే అద్వానీ గానీ స్పష్టత ఇవ్వలేదు.