రాళ్ల దాడిలో చెన్నై యువకుడు మృతి: సిగ్గుతో తలదించుకుంటున్నానని సీఎం ముఫ్తీ
చెన్నై/శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో అల్లరి మూకలు రాళ్లదాడులతో రెచ్చిపోతున్నాయి. నిరంతంగా సాగుతున్న ఈ హింసాత్మక ఘటనలతో ప్రజలు, భద్రతా దళాలు ప్రాణాలు కోల్పోతున్నారు. సోమవారం విహారయాత్ర నిమిత్తం కాశ్మీర్కు వెళ్లిన తమిళనాడుకు చెందిన ఓ యువకుడు ఈ అల్లరిమూకల దాడిలో మృతి చెందిన ఘటన దుమారం రేపుతోంది.
తిరుమణి అనే వ్యక్తి తన కుటుంబసభ్యులతో కలిసి కారులో వెళుతుండగా అల్లరి మూకలు వాహనంపై రాళ్లు రువ్వారు. అతని తలకి తీవ్ర గాయం కావడంతో సమీపంలోని స్కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్ర రక్తస్రావం కావడంతో అతను ఆస్పత్రిలో చనిపోయాడు.
తిరుమణి ప్రయాణిస్తున్న కారుతో పాటు మరికొన్ని వాహనాలపై రాళ్లు రువ్వేందుకు ఆందోళనకారులు యత్నించారు. కాగా, విహారయాత్ర నిమిత్తం కుటుంబంతో కాశ్మీర్కు వచ్చిన తిరుమణి సోమవారం ఉదయం గుల్మార్గ్కు బయలుదేరారని ఆ సమయంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు.
సిగ్గుతో తలదించుకుంటున్నా: సీఎం ముఫ్తీ
ఈ ఘటన గురించి తెలుసుకున్న జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. అతని కుటుంబసభ్యులను కలిసి ఓదార్చారు. అనంతరం ముఫ్తీ మీడియాతో మాట్లాడుతూ..'సిగ్గుతో తలదించుకుంటున్నాను. ఇది చాలా బాధాకరం. గుండెపగిలిపోతోంది. కాశ్మీర్లో నిరంతరంగా సాగుతున్న హింస పేద యువకులు, భద్రతా దళాల ప్రాణాలను హరిస్తోంది. దీనికి చరమగీతం పాడటానికి ఒక మధ్యేమార్గాన్ని కనుగొనాలి' అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
అవివేకులు, గవర్నర్ పాలన విధించాలి: ఒమర్
చెన్నై యువకుడు మరణించిన ఘటనపై జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. రాళ్లు రువ్వుతున్న వారు అల్లరి మూకలు కాదని, గూండాలు, అవివేకులని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో సీఎం ముఫ్తీ విఫలమయ్యారని, గవర్నర్ పాలన విధించాలని ఒమర్ డిమాండ్ చేశారు.