ఏ వ్యాక్సీన్ కావాలో నిర్ణయించుకునే అవకాశం లేదు : ప్రెస్ రివ్యూ
కరోనా వ్యాక్సినేషన్కు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. తొలిదశలో ఈ నెల 16వ తేదీ నుంచి ఈ వ్యాక్సిన్లను దాదాపు 3 కోట్ల మంది హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లకు ఉచితంగా అందజేయనున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్లో నిర్దిష్టంగా ఏదైనా ఒకటి ఎంచుకునే అవకాశం లబ్ధిదారులకు లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసిందంటూ సాక్షి ఒక కథనంలో తెలిపింది.
రెండు టీకాల్లో ఎవరికి ఏ టీకా వేయాలన్నది ప్రభుత్వమే నిర్ధరిస్తుందని వెల్లడించింది. అంటే, ఇష్టమైన టీకా తీసుకునే వెసులుబాటు లేనట్లే. వచ్చే ఎనిమిది నెలల్లో దేశంలో 30 కోట్ల మందికి కరోనా టీకా ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ను భారత్లో పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ఉత్పత్తి చేస్తోంది. తొలిదశలో ఈ సంస్థ నుంచి 1.1 కోట్ల టీకా డోసులు, భారత్ బయోటెక్ నుంచి 55 లక్షల డోసుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి 10 కోట్ల డోసుల్లో ఒక్కో డోసును రూ.200 చొప్పున ధరకు ప్రభుత్వానికి విక్రయించనున్నట్లు సీరం సంస్థ సీఈవో అదార్ పూనావాలా చెప్పారు. పన్నులతో కలుపుకుంటే ఒక్కో డోసు ధర రూ.220కు చేరుతుందన్నారు. ఇక కోవాగ్జిన్ ధర పన్నులు లేకుండా ఒక్కో డోసు రూ.295. పన్నులు కూడా కలిపితే రూ. 09.5 అవుతుంది.
55 లక్షల డోసుల కొనుగోలుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా, ఇందులో 16.5 లక్షల డోసులను ఉచితంగా సరఫరా చేస్తామని భారత్ బయోటెక్ హామీ ఇచ్చింది. ఈ లెక్కన చూస్తే కోవాగ్జిన్ ఒక్కో డోసు రూ.206కే ప్రభుత్వం కొన్నట్లు అవుతుందని అధికారులు చెప్పారు. కరోనా టీకా రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాత దాని ప్రభావం కనిపించడం మొదలవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ బుధవారం చెప్పారని ఈ కథనంలో తెలిపారు.
- కరోనావైరస్: ఇప్పటివరకు ఎన్ని వ్యాక్సీన్లు సిద్ధమయ్యాయి? వీటిని ప్రజలకు ఎలా ఇస్తారు?
- కోడి రామ్మూర్తి నాయుడు: 'కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
ఆంద్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో మారణాయుధాలపై నిషేధం
ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పదునైన మారణాయుధాలతో తిరగడాన్ని నిషేధించిందంటూ ప్రజాశక్తి ఒక వార్తను ప్రచురించింది.
అయితే, ఈ నిషేధం ఏపీ మొత్తం వర్తించదు. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలతో పాటు ఆంధ్ర ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఈ నిషేధం అమలు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
జనవరి 16 నుంచి వరుసగా ఆరు నెలల పాటు అమలులో ఉంటుంది. శాంతి భద్రతల పరిరక్షణకు ముందు జాగ్రత్తగా నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా మారణాయుధాలతో దొరికితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
- సంక్రాంతి సంబరాలకు భీమవరం ఎందుకు కేంద్రంగా మారింది
- "నన్నెందుకు వదిలేశావు? పురుగుల మందు తాగి చనిపోతున్నా"
తెలంగాణలో పారిశుద్ధ్య కార్మికుడికి మొదటి టీకా
రాష్ట్రంలో తొలి కోవిడ్ టీకాను గాంధీ ఆసుపత్రిలో గత 10 నెలలుగా విశేష సేవలందిస్తున్న ఒక పారిశుద్ధ్య కార్మికుడికి వేయనున్నారని ఈనాడు ఒక కథనంలో తెలిపింది.
ఈ నెల 16న ఆయనకు టీకా వేయడంతో తెలంగాణ రాష్ట్రంలో పంపిణీ ప్రారంభమవుతుంది. తొలిరోజున టీకా వేసే 139 కేంద్రాలూ ప్రభుత్వ రంగంలోనే ఉంటాయి. 40 కేంద్రాలను ప్రైవేటు ఆసుపత్రుల్లో, 99 కేంద్రాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించాలని తొలుత నిర్ణయించినా.. ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చుకుంది.
ముందుగా ప్రభుత్వ వైద్యంలో టీకాలు వేస్తే, సమస్యలపై పూర్తి అవగాహన వస్తుందని భావిస్తోంది. తొలివారం మొత్తం సర్కారు దవాఖానాల్లోనే నిర్వహించి, రెండో వారం నుంచి ప్రైవేటులోనూ పంపిణీ ప్రారంభించనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష జరిగింది. గురువారం సాయంత్రానికి కొవిన్ యాప్ సమస్యలను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు.
టీకా పంపిణీ ప్రారంభమయ్యాక కూడా యాప్లో సమస్యలు ఎదురైతే.. ఆఫ్లైన్లో సమాచారాన్ని పొందుపర్చాలని సూచించారు. లబ్ధిదారులకు సందేహాలుంటే.. 104 నంబరుకు కాల్ చేయాలని ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు.
రాష్ట్రంలో 33 జిల్లాల్లోని 139 కేంద్రాలకు టీకాల తరలింపు ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఇప్పటికి 3.64 లక్షల కొవిషీల్డ్, 20 వేల కొవాగ్జిన్, మొత్తంగా 3.84 లక్షల టీకాలు రాష్ట్ర స్థాయి గిడ్డంగికి చేరాయి. ఆయా జిల్లాలకు 5,527 కొవిషీల్డ్ టీకా వాయిల్స్ను పంపించారు.
తొలివారంలో 55,270 మంది సర్కారు వైద్యసిబ్బందికి టీకా ఇస్తారు. వీరిలో అత్యధికంగా హైదరాబాద్లో 18,070 మంది ఉండగా.. అత్యల్పంగా నాగర్కర్నూల్ జిల్లాలో 230 మంది నమోదయ్యారు. ప్రభుత్వ రంగంలోని 1.60 లక్షల మంది వైద్యులు, సిబ్బందికి దశల వారీగా టీకాలిస్తారు. కేంద్రం నుంచి మరికొన్ని డోసులు రాగానే ప్రైవేటు వైద్య సిబ్బందికీ వేస్తారు.
టీకా పంపిణీలో స్థానిక నాయకులతో సమన్వయం చేసుకోవాలని జిల్లా అధికారులను ఆరోగ్యశాఖ ఆదేశించింది. మరోవైపు హైదరాబాద్లో భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ టీకాలను దేశంలోని పలు నగరాలకు బుధవారం తరలించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాల్లో వీటిని రవాణా చేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు 20 వేల టీకాలను పంపించారు.
- భారత్లో తయారవుతున్న ఈ పెన్నులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ... ఎందుకంటే...
- డోనల్డ్ ట్రంప్ను అధ్యక్ష పదవిలోంచి తీసేయొచ్చా... 25వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతోంది?
ఆలయ దాడుల్లో కుట్ర లేదన్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్
రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల్లో కుట్రకోణం లేదని.. దొంగలు, నిధి వేటగాళ్లు, మూఢ నమ్మకాలు, ఆస్తి గొడవలు, పిచ్చివాళ్లు, అడవి జంతువులు కారణమని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో పేర్కొంది.
అంతర్వేది రథం దగ్ధం నుంచి రామతీర్థం ఘటన వరకు రాష్ట్రంలో 44 ఘటనలు జరగ్గా వీటిలో 29 ఘటనలకు ఎవరు కారకులో తేల్చేశామని చెప్పారు. వాటిలో ఎక్కడా కుట్రకోణం కనిపించలేదని, మిగతా వాటిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసేందుకు
డీఐజీ అకోశ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండేందుకు నిరంతం శ్రమిస్తున్న పోలీసులపై కుల, మత, ప్రాంత ముద్రలు వేయడం తగదని ప్రతిపక్షాలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. డీజీపీ సవాంగ్ బుధవారం మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో సిట్ చీఫ్ అశోక్ కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
''రాష్ట్రంలో ఆలయాలపై దాడులకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు వాస్తవం కాదు. గత ఏడాది సెప్టెంబరు నుంచి జరగిన 44 ఘటనల్లో 29 ఘటనల నిగుతేల్చాం. ఏ ఒక్క దాంట్లోనూ కుట్రకోణం కనిపించలేదు. అరెస్టయిన 80 మందిలో అంతర్రాష్ట్ర ముఠాలు కూడా ఉన్నాయి. అంతర్వేది రథం దగ్ధం తర్వాత అల్లర్లు, ఆరోపణలు మొదలయ్యాయి.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీసులకు కులం, మతం, ప్రాంతం ఆపాదిస్తున్నారు. కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు పోలీసులు ప్రాణాలు ఫణంగా పెట్టి డ్యూటీ చేశారు. అలాంటి మాపై ఆరోపణలు చేయడం తగదు. ఆలయాల్లో 30,551 సీసీ కెమెరాలు, 15,394 గ్రామాల్లో శాంతి కమిటీలు ఏర్పాటు చేశాం. 4,614 మందిపై నిఘా పెట్టాం, వారిలో 1,635 మంది పాత నేరస్తులు ఉన్నారు.
రామతీర్థంలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులు జరుగుతున్న క్రమంలో మూడు రోజుల ముందు ఎవరో దుశ్చర్యకు పాల్పడ్దారు. అంతర్వేది రథం దగ్ధం కేసు సీబీఐకి అప్పగించినా ఇంకా తీసుకోక పోవడంతో ఆలస్యం కాకుండా సిట్ దర్యాప్తు చేయబోతోంది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠినంగా ఉంటాం. మీడియా కూడా చెక్ చేసుకోకుండా వార్తలు ప్రసారం చేయవద్దు’’ అని సవాంగ్ అన్నారని ఈ కథనంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- రైతుల నిరసనలు: సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని ఆ నలుగురు ఎవరు?
- కోడి రామ్మూర్తి నాయుడు: 'కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- వందల ఏళ్ల పాటు ఆఫ్రికాలో 'కనిపించిన' ఆ పర్వతాలు ఎలా మాయమయ్యాయి?
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- "నన్నెందుకు వదిలేశావు? పురుగుల మందు తాగి చనిపోతున్నా"
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- మైనారిటీలకు రక్షణ కల్పించడంలో పాకిస్తాన్ విఫలం అవుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)