ట్రిపుల్ ఎల్: భారత్ ముందు అతి పెద్ద సంక్షోభం: అవకాశంగా మార్చుకోబోతున్నాం: అందుకే..!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ రూపంలో భారత్ ముందు అతి పెద్ద సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని అవకాశం మార్చుకోవడానికి ఇదే సరైన సమయమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ సంక్షోభాన్ని అవకాశంగా బదలాయించుకోవడానికి అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. దేశాన్ని అన్ని రంగాల్లోనూ బలోపేతం చేయడానికి ఇదే మంచి తరుణమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విశ్వసిస్తున్నారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా అనేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించామని తెలిపారు.
కుండబద్దలు కొట్టిన నిర్మలమ్మ: విద్యుత్ పంపిణీ ప్రైవేటుకు: అమ్మకానికి 6 విమానాశ్రయాలు
అయిదో విడత కేటాయింపులపై..
కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కీలక రంగాలను ఆర్థికంగా స్వావలంబన కల్పించడానికి ప్రధానమంత్రి 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్యాకేజీని ఏఏ రంగాలకు వర్తింపజేయాలో వివరించే బాధ్యతను ఆయన ఆర్థిక శాఖకు అప్పగించారు. ఇందులో భాగంగా ఆ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నిర్మలా సీతారామన్. ఆర్థిక ప్యాకేజీ వివరాలను నాలుగురోజులుగా వరుసగా వివరిస్తు వస్తున్నారు. చివరగా ఆమె ఈ ప్యాకేజీ మీద ఆదివారం మరోసారి దేశ రాజధానిలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
జన్ధన్ ఖాతాలకు
దేశంలో లాక్డౌన్ ప్రకటించిన వెంటనే తాము పేదలను ఆదుకోవడానికి చర్యలను తీసుకున్నామని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద జన్ధన్ ఖాతాలు ఉన్న నిరుపేదలకు 500 రూపాయల చొప్పున నగదును బదిలీ చేశామని అన్నారు. కోట్లాదిమందికి ఏకకాలంగా నగదును బదలీ చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఙానాన్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేసుకోవడానికి ఈ సంక్షోభం ఓ అవకాశాన్ని కల్పించిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి అవకాశాలను మరిన్ని సృష్టించుకుంటామని అన్నారు.
ట్రిపుల్ ఎల్..
అయిదో విడతగా వివరించబోయే ప్యాకేజీలో ట్రిపుల్ ఎల్కు ప్రాధాన్యత ఇచ్చినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ల్యాండ్, లేబర్, లిక్విడిటీ.. ఈ మూడు అంశాలపైనే ఫోకస్ పెట్టామని చెప్పారు. లాక్డౌన్ సమయంలో 20 కోట్ల జన్ధన్ ఖాతాలకు 500 రూపాయల చొప్పున మొత్తం 10,025 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వెల్లడించారు. 2.2 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికుల కోసం 3,950 కోట్ల రూపాయలను కేటాయించామని చెప్పారు. 6.81 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్లను అందజేశామని వివరించారు.
లాక్డౌన్ సమయంలో ఆదుకున్నాం..
అలాగే 12 లక్షల మంది ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ నుంచి నిధుల నుంచి విత్ డ్రా చేసుకోవడానికీ అవకాశాన్ని కల్పించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, విద్య, హెల్త్కేర్ వంటి ప్రాథమిక రంగాలకు సైతం చివరి విడత ప్యాకేజీలో నిధులను కేటాయించినట్లు చెప్పారు. రెండు నెలల వ్యవధిలో 4,100 కోట్ల రూపాయల మొత్తాన్ని హెల్త్కేర్పై ఖర్చు చేయడానికి రాష్ట్రాలకు విడుదల చేశామని అన్నారు. వన్టైమ్ ట్రాన్స్ఫర్ రూపంలో 8.19 కోట్ల మంది రైతులకు రెండువేల రూపాయల చెల్లించామని, దీనికోసం 16,349 కోట్ల రూపాయల వ్యయం చేసినట్లు చెప్పారు.