నోట్ల రద్దు: నెల తర్వాత ఎన్నో వరాలు ప్రకటించిన అరుణ్ జైట్లీ, ఇవే...
నోట్ల రద్దు ప్రకటన చేసిన నెల రోజులైన అనంతరం నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం నాడు వరాలు ప్రకటించారు.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు ప్రకటన చేసిన నెల రోజులైన అనంతరం నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం నాడు వరాలు ప్రకటించారు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా పెట్రోలు కొనే వారికి 0.75 శాతం డిస్కౌంట్ ప్రకటించారు.
రైల్వే టిక్కెట్లు ఆన్ లైన్ ద్వారా కొనే వారికి రూ.10 లక్షల ఇన్సురెన్స్ ఉచితంగా ఇస్తామన్నారు. సబర్బన్ రైళ్లలో నెల, ఏడాది సీజనల్ టికెట్లు కొనుగోలు చేసేవారికి 0.5 శాతం రాయితీ లభిస్తుందన్నారు. రైల్వేలో ఇప్పటి వరకు 58 శాతం మంది ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటున్నారని జైట్లీ తెలిపారు.
డిజిటల్ లావాదేవీల్లో రైల్వే క్యాటరింగ్, వసతి సౌకర్యం కోసం బుక్ చేస్తే 5 శాతం రాయితీ ఇస్తామన్నారు. ఇదే నగదు ఇచ్చి కొనే వారికి ఎలాంటి ఇన్సురెన్స్ ఉండదని తెలిపారు. జాతీయ రహదారుల పైన టోల్ ప్లాజాలకు డిజిటల్ పేమెంట్ చేసే వారికి పది శాతం డిస్కౌంట్ ఇస్తారు.
రైల్వే క్యాటరింగ్, రెస్ట్ హౌస్లకు సంబంధించి ఆన్ లైన్ పేమెంట్లు చేసే వారికి 5 శాతం డిస్కౌంట్ ఇస్తారు. లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలను ఆన్ లైన్ ద్వారా చెల్లించే వారికి 8 శాతం, సాధారణ భీమా పాలసీలకు 10 శాతం డిస్కౌంట్ ప్రకటించారు.
లక్ష గ్రామాలకు స్వైపింగ్ మిషన్లను పంపిస్తున్నట్లు తెలిపారు. 10వేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు 2 పీవోఎస్ యంత్రాలు ఉచితంగా ఇస్తామన్నారు. షెడ్యూల్ ప్రకారం నగదును అన్ని ప్రాంతాలకు ఆర్బీఐ సరఫరా చేస్తోందని తెలిపారు.
గత నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్ల రద్దును ప్రకటించిన అనంతరం నగదరహిత లావాదేవీలు ఇరవై నుంచి 40 శాతం పెరిగినట్లు అరుణ్ జైట్లీ తెలిపారు.
ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు ఆన్లైన్లో చెల్లింపులు చేస్తే 10శాతం ఇస్తామని తెలిపారు. జనవరి 1 నుంచి ముంబై సబర్బన్ రైళ్లలో రాయితీ విధానం అమల్లోకి వస్తుందన్నారు. నగదు రహిత లావాదేవీల పెంపునకు 11 సూత్రాలు రూపొందించినట్లు చెప్పారు.
రాయితీలు ఇక్కడే..
- డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా డీజిల్, పెట్రోలు కొనుగోలు చేస్తే 0.75% రాయితీ. ప్రస్తుతం రోజుకు 4.5 కోట్ల మంది రూ.1,800 కోట్ల ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా రూ.2 లక్షల కోట్లు విలువైన లావాదేవీలు జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
- డిజిటల్ విధానంలో సబర్బన్ రైల్వే నెలవారీ పాసులు తీసుకొనే వారికి. తొలుత ముంబై సబర్బన్ నుంచి ప్రారంభం.
- ఆన్లైన్ విధానంలో రైల్వే టిక్కెట్లు కొనేవారికి రూ.10 లక్షల బీమా.
- రైల్వేలో భోజనం, వసతి గదులు బుక్ చేసుకొనేవారికి ఐదు శాతం రాయితీ
- వెబ్సైట్ల ద్వారా ప్రభుత్వ సంస్థల్లో సాధారణ, జీవిత బీమా పాలసీలు కొనుగోలు చేసేవారికి ప్రీమియంలో 8-10% రాయితీ
- కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్న వారికి నాబార్డ్ రూపే కార్డులు
- హైవే టోల్గేట్స్ వద్ద ఆర్ఎఫ్ఐడీ, డిజిటల్ విధానంలో చెల్లింపులు చేస్తే పది శాతం రాయితీ.
- పీవోఎస్ యంత్రాలు, మైక్రో ఏటీఎమ్లు, మొబైల్ పీవోఎస్లు వినియోగించే వారి వద్ద నెలవారీ రుసుము రూ.100 తీసుకోరాదని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం సూచించింది. చిన్న తరహా వ్యాపారులను క్యాష్ లెస్ లావాదేవీలకు ప్రోత్సహించేందుకు ఇలా చేస్తున్నారు.