సీఎం షాక్ ఇచ్చిన ఐటీ శాఖ అధికారులు, అకౌంటెంట్ ఇంటిలో సోదాలు, సినీ తారలు!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామికి ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు పరోక్షంగా ఝలక్ ఇచ్చారు. సీఎం కుమారస్వామి చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) ఇల్లు, కార్యాలయాలపై గురువారం ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేసి సోదాలు చేశారని తెలిసింది.
బెంగళూరులోని కుమారపార్క్ లో నివాసం ఉంటున్న చార్టెడ్ అకౌంటెంట్ హెచ్.బి. సునీల్ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు, జేడీఎస్ నాయకులు అంటున్నారు.
చార్టెడ్ అకౌంటెంట్ సునీల్ సీఎం కుమారస్వామితో పాటు ఆయన భార్య, కుమారుడు ఆస్తుల లెక్కలు చూసుకుంటున్నారు. అంతే కాకుండా అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖ సినీ తారల అకౌంట్స్ ను సునీల్ చూసుకుంటున్నారు.
గత శాసన సభ ఎన్నికల సందర్బంలో సునీల్ ఇంటిలో ఐటీ సోదాలు జరిగాయి. సునీల్ ఇంటిలో ఐటీ దాడులు చెయ్యడాన్ని జేడీఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఐటీ శాఖను అడ్డం పెట్టుకుని బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని జేడీఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
తన ఇంటిలో, కార్యాలయంలో ఐటీ శాఖ దాడులు జరగలేదని చార్టెడ్ అకౌంటెంట్ సునీల్ అంటున్నారు. అయితే ప్రత్యక్ష సాక్షులతో పాటు జేడీఎస్ నాయకులు ఐటీ శాఖ దాడులు జరిగాయని అంటున్నారు. మొత్తం మీద సీఎం కుమారస్వామికి ఐటీ శాఖ పరోక్షంగా ఝలక్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.