తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావుకు షాక్: ఐటీ దాడులు
చెన్నైలోని అన్నా నగర్ లోని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామ్మోహనరావు ఇంట్లో ఐటీ అధికారులు దాడులు చేశారు.
చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామ్మోహనరావు ఇంట్లో ఐటీ అధికారులు దాడులు చేశారు. చెన్నైలోని అన్నానగర్ లోని రామ్మోహన్ రావు ఇంటిలో బుధవారం వేకువ జామున ఐదు గంటల నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
వందల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని నగదుగా మార్చారని తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమిళనాడులో వరుసగా ఐటీ దాడులు జరగడంతో అన్నాడీఎంకే నాయకులు హడలిపోతున్నారు.
ఇటీవల అన్నాడీఎంకే నాయకుడు శేఖర్ రెడ్డి ఇంట్లో రూ. 130 కేజీల బంగారం, రూ. 170 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న తరువాత ఐటీ అధికారులు పలువురి మీద నిఘా వేశారు. శేఖర్ రెడ్డికి ఎవరెవరు సహకరించారు అని ఐటీ అధికారులు ఆరా తీశారు. శేఖర్ రెడ్డికి తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు లింక్ ఉందని అధికారులు అంటున్నారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, నెచ్చెలి శశికళతో పాటు అన్నాడీఎంకే మంత్రులకు అత్యంత సన్నిహితుడైన రామ్మోహన్ రావు ఇంటి మీద ఐటీ దాడులు జరగడం పెద్ద చర్చకు దారి తీసింది.
రెండు రోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. ఒక రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఇంటి మీద ఐటీ దాడులు జరిగే ముందు కచ్చితంగా ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు తెలిసి ఉంటుందని సమాచారం.
పన్నీర్ సెల్వంకు తెలిసే ఐటీ దాడులు జరిగాయా ? తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ను ఐటీ అధికారులు ఎందుకు టార్గెట్ చేసుకున్నారు ? అనే విషయం అంతుపట్టడం లేదు.
రామ్మోహన్ రావు ఇంట్లో పెద్ద మొత్తంలో నల్లధనం స్వాధీనం చేసుకున్నారని సమాచారం. అయితే ఐటీ అధికారులు మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. రామ్మోహన్ రావు సన్నిహితులు, బంధువుల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని సమాచారం.