ఉద్యోగాల తొలగింపుపై టెక్కీల ఆందోళన, పనితీరే ఆధారమంటున్న కాగ్నిజెంట్
9 మాసాల వేతనంతో ఉద్యోగులను వదిలించుకొంటున్న కాగ్నిజెంట్ సంస్థపై ఐటీ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఉద్యోగులను రోడ్డున పడేశారంటూ ఆందోళనకు దిగాయి.
చెన్నై: 9 మాసాల వేతనంతో ఉద్యోగులను వదిలించుకొంటున్న కాగ్నిజెంట్ సంస్థపై ఐటీ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఉద్యోగులను రోడ్డున పడేశారంటూ ఆందోళనకు దిగాయి. కొన్ని సంఘాలు తమిళనాడు లేబర్ డిపార్ట్ మెంట్ ను ఆశ్రయించాయి.
2.6 లక్షల మంది ఉద్యోగులున్న కాగ్నిజెంట్ సంస్థలో 5 శాతం మంది ఉద్యోగులను తొలగించడంపై ఐటీ సంఘాలు తీవ్రంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగులను రోడ్డున పడేశారని ఆ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఫోరమ్ ఫర్ ఐటీ ఎంప్లాయిస్ , ఎన్డీఎల్ ఎప్ ఐటీ ఎంప్లాయిస్ లు ఈ మేరకు తమిళనాడు లేబర్ కార్యాలయంలో పిటిషన్లు దాఖలు చేశాయి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల పనితీరు అసంతృప్తికరంగా ఉందనే కారణాలను చూపుతూ కాగ్నిజెంట్ సంస్థ ఉద్యోగులను తొలగించింది.
అయితే ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతున్నాయి ఐటీ ఉద్యోగసంఘాల నాయకులు. ఉద్యోగుల తొలగింపుపై కాగ్నిజెంట్ కూడ స్పందించింది. ప్రతి ఏటా ఉద్యోగుల పనితీరును సమీక్షిస్తుంటామంది. అందులో భాగంగానే లక్ష్యాలను చేరుకోలేని వారిని తొలగించి సంస్థలో మార్పులు తప్పనిసరన్నారు. అన్ని ఐటీ కంపెనీల్లో ఇది సర్వసాధారణమేనని చెప్పారు.