ఐటీ ఉద్యోగులకు కష్టకాలం: డిమాండ్ కొత్త టెక్నాలజీకే.. నేర్చుకోవాలంటే లక్షల్లో ఫీజులు
చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ లక్షల రూపాయలు వెచ్చించి మరీ కొత్త టెక్నాలజీని నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
బెంగళూరు: ఐటీలో కొత్తగా వస్తున్న టెక్నాలజీని అందుకోగలిగితేనే ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని నిలుపుకోగలుగుతారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త రకం టెక్నాలజీ అందుబాటులోకి వస్తుండటంతో ఐటీ ఉద్యోగాలు అప్డేట్ కావాల్సిన సమయం ఆసన్నమైంది.
ఐటీకి ఏమైంది?: కెరీర్పై నిజంగానే కత్తి వేలాడుతోందా?, ఇదీ అసలు మర్మం..
వేగంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్కిల్స్ పెంపొందించుకోకపోతే ఉద్యోగం ఊడిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. దానికి తోడు ఆటోమేషన్ ప్రభావం ఎలాగు ఉండనే ఉంది. ఈ క్రమంలోనే చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ లక్షల రూపాయలు వెచ్చించి మరీ కొత్త టెక్నాలజీని నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
సాఫ్ట్ వేర్ అల్లుడా?.. వద్దు బాబోయ్: కాలం మారింది.. ఐటీ 'కళ' చెదిరింది
ఉన్నత స్థానంలో ఉండాలంటే:
ఉన్నత స్థానాల్లోకి వెళ్లాలనుకునే ఐటీ ప్రొఫెషనల్స్.. కొత్త కోర్సులను నేర్చుకోవాల్సి ఉంటుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇందుకోసం రూ.4లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని నివేదికలు పేర్కొనడం గమనార్హం.
ఐటీలో 5-10ఏళ్ల అనుభవమున్న ప్రొఫెషనల్స్ లోనే ఈ కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 10-12నెలల వ్యవధి ఉండే ఈ కోర్సులను ఆన్ లైన్ వీడియో క్లాసులు, అసైన్ మెంట్స్, టెస్టుల ద్వారా నేర్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Recommended Video
కంపెనీలు ఆ రిస్క్ తీసుకోవట్లేదు:
ఇదివరకు చాలా కంపెనీలు.. ట్రైనీ ఎంప్లాయిస్ కు శిక్షణ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకునేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్కిల్స్ కలిగి ఉన్నవారినే నేరుగా ఎంచుకుంటున్నాయి.
సంస్థలో చేర్చుకున్నాక వారికి శిక్షణ ఇచ్చే రిస్క్ కంపెనీలు తీసుకోవడం లేదు. చాలా కంపెనీలకు రీస్కిల్ చేయడానికి సమయం, అవకాశం లేదని ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థ హెడ్ హంటర్స్ ఇండియా వ్యవస్థాపకుడు క్రిష్ లక్ష్మికాంత్ తెలిపారు.
ఉద్యోగాలు కాపాడుకోవాలంటే 'అప్డేట్' తప్పనిసరి:
ప్రస్తుతం మధ్యస్థాయి మేనేజర్లుగా పనిచేస్తున్న చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ రీస్కిల్ కోసం ఆన్ లైన్ కోర్సులను ఆశ్రయిస్తున్నారు. కొత్త స్కిల్స్ అందిపుచ్చుకోకపోతే ఉద్యోగం కాపాడుకోవడం కష్టం కాబట్టి.. లక్షల రూపాయాల ఫీజులు చెల్లించి మరీ కోర్సులు నేర్చుకుంటున్నారు. నిజానికి ఐఎస్బి, ఇతర ఎంబీఏ కాలేజీల్లో ఏడాది కోర్సులు పూర్తి చేయడానికి రూ.6లక్షలు ఖర్చు అవుతుండటంతో.. దాని కన్నా తక్కువ ఫీజుతో అందుబాటులో ఉన్న ఆన్ లైన్ కోర్సులనే వారు ఆశ్రయిస్తున్నారు.
డిమాండ్ వీటికే:
డేటా అనాలిటిక్స్, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కొత్త టెక్నాలజీకే ప్రస్తుతం ఉద్యోగ డిమాండ్ ఎక్కువగా ఉంది. ఐటీలో సాధారణ స్థాయి ఉద్యోగాలు కనుమరుగవుతుండటంతో చాలామంది ఈ కోర్సులను ఆశ్రయిస్తున్నారు.
చెన్నైకి చెందిన మేనేజ్ మెంట్ కాలేజీ గ్రేట్ లీక్స్ ఇనిస్టిట్యూట్, ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ గ్రేట్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ లను ప్రారంభించింది. బిగ్ డేటా, బిజినెస్ అనలిటిక్స్ లో రెండేళ్ల కోర్సులను ఈ సంస్థ ఆఫర్ చేస్తోంది. వీటి ద్వారా పొందిన సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందితే.. కనీసం 40శాతం వేతనం పెంపు ఉంటుందని చెబుతున్నారు.