కర్ణాటక మంత్రికి ఐటీ శాఖ షాక్, సీఎం సన్నిహితుడు, ఒక్క రోజు ముందే జోస్యం చెప్పిన సీఎం!
బెంగళూరు: లోక్ సభ ఎన్నికల జరుగుతున్న సందర్బంలో బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని 15 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. గురువారం వేకువ జామున నుంచి బెంగళూరు నగరంతో సహ 15 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంత్రి సీఎస్. పుట్టరాజు, బెంగళూరులోని జయనగర్ సౌత్ ఎండ్ సర్కిల్ లో నివాసం ఉంటున్న ప్రముఖ పాప్ కార్న్ వ్యాపారి సిద్దిక్ సేఠ్ తదితర నివాసాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సీఎం ఒక్క రోజు ముందే జోస్యం చెప్పినట్లే ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
సీఎం కొడుకు నామినేషన్, రూ. లక్షల్లో ప్రజల ఆస్తికి హాని, మూడు ఎఫ్ఐఆర్ లు, హీరోకు షాక్!
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామికి అత్యంత సన్నిహితుడు, సన్న నీటి పారుదల శాఖా మంత్రి సీఎస్. పుట్టరాజుకు ఐటీ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. మంత్రి పుట్టరాజుతో సహ ఆయన బంధువులు, సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు జరుగుతున్నాయి.
మండ్య టార్గెట్
మండ్య ఇన్ చార్జ్ మంత్రి సీఎస్. పుట్టరాజును ఐటీ శాఖ అధికారులు టార్గెట్ చేశారు. మండ్య జిల్లా పాండవపుర తాలుకాలోని చినకురళిలోని మంత్రి సీఎస్ పుట్టరాజు నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. సీఎస్ పుట్టరాజు అన్న కుమారులు నివాసం ఉంటున్న మైసూరులోని నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.
సీఆర్ పీఎఫ్ బలగాలు
స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండ ఐటీ శాఖ అధికారులు సీఆర్ పీఎఫ్ పోలీసులను వెంట పెట్టుకుని మంత్రి సీఎస్. పుట్టరాజు, ఆయన బంధువుల నివాసాల దగ్గరకు చేరుకుని కట్టుదిట్టమైన భద్రతతో సోదాలు చేస్తున్నారు. ఇంటిలోని వ్యక్తులు బయలకు వెళ్లకుండా, బయటి వ్యక్తులు లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
రాజకీయ కుట్ర
రాజకీయ కుట్రలో భాగంగా తన ఇంటి మీద ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రి సీఎస్. పుట్టరాజు ఆరోపించారు. ఐటీ శాఖ అధికారులు జేడీఎస్, కాంగ్రెస్ నాయకులను లక్షంగా చేసుకున్నారని మంత్రి సీఎస్. పుట్టరాజు విమర్శించారు. గురువారం కాంగ్రెస్, జేడీఎస్ నాయకుల సమావేశం నిర్ణయించి ఐటీ శాఖ దాడుల విషయంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి సీఎస్. పుట్టరాజు అన్నారు. ఐటీ దాడులతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఐటీ శాఖ అధికారులు తనను టార్గెట్ చేస్తారని ముందుగానే ఊహించానని మంత్రి సీఎస్ పుట్టరాజు అన్నారు.
ముందే బాంబు పేల్చిన సీఎం
గురువారం కర్ణాటకలోని పలువురు ప్రముఖులను టార్గెట్ చేసుకుని ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఒక్క రోజు ముందు (బుధవారం) బాంబు పేల్చిన విషయం తెలిసిందే. బుధవారం మండ్యలో మీడియాతో మాట్లాడిన సీఎం కుమారస్వామి దాదాపు 300 మంది ఐటీ శాఖ అధికారులు దాడులు చెయ్యడానికి బెంగళూరు ఎయిర్ పోర్టు చేరుకోవడానికి సిద్దం అయ్యారని, వారిని గమ్యం చేర్చడానికి క్యాబ్ లు సిద్దంగా ఉన్నాయని ఆరోపించారు. సీఎం కుమారస్వామి చెప్పినట్లే గురువారం ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.
బీజేపీ లీడర్ చెప్పారు
గురువారం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసే అవకాశం ఉందని బీజేపీలో ఉన్న తన స్నేహితుడు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని సీఎం కుమారస్వామి అన్నారు. స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సీఆర్ పీఎఫ్ పోలీసులకు వెంటపెట్టుకుని వస్తారని, మీరు జాగ్రత్తగా ఉండాలని బీజేపీ నాయకుడు చెప్పారని కుమారస్వామి బుధవారం మీడియాకు చెప్పారు.
దీదీ చేసినట్లు చేస్తా
కేంద్ర ప్రభుత్వం తమను టార్గెట్ చేసుకుని సోదాలు చేయిస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసినట్లు తాను చెయ్యవలసి వస్తుందని సీఎం కుమారస్వామి హెచ్చరించారు. లోక్ సభ ఎన్నికల సందర్బంగా బీజేపీ నీచ రాజకీయాలు చేస్తుందని సీఎం కుమారస్వామి ఆరోపించారు. సీబీఐ అధికారులను అరెస్టు చెయ్యాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర పోలీసులకు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.