మాజీ ఉప ముఖ్యమంత్రికి షాక్, నిన్న ఐటీ దాడులు, నేడు ఈడీ ఎంట్రీ, రేపు విచారణ !
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ ఇల్లు, విద్యా సంస్థల మీద ఆదాయపన్ను (ఐటీ శాఖ) శాఖ అధికారులు దాడులు చేసిన తరువాత ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రంగంలోకిదిగారు. డాక్టర్ జీ. పరమేశ్వర్ మీద కేసు నమోదు చేసి విచారణ చెయ్యాలని ఈడీ అధికారులు నిర్ణయించారని తెలిసింది. ఇప్పటికే బెంగళూరులోని ఐటీ శాఖ కార్యాలయం చేరుకున్న ఈడీ అధికారులు డాక్టర్ జీ. పరమేశ్వర్ గురించి వివరాలు సేకరిస్తున్నారని తెలిసింది.
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్: 104 నాటౌట్, చివరికి డెలివరి బాయ్ చిక్కాడు, అక్కడే ఫైన్ !
ఇల్లు, విద్యా సంస్థలు
మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ ఇల్లు, విద్యా సంస్థల మీద దాడులు చేసిన ఐటీ శాఖ అధికారులు సోదాలు చేసి భారీ మొత్తంలో నగదు, విలువైన డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఐటీ శాఖ అధికారులు ఇప్పటికే ఈడీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు.
రూ. 70 లక్షలు
ఐటీ శాఖ కార్యాలయానికి చేరుకున్న ఈడీ అధికారులు డాక్టర్ జీ. పరమేశ్వర్ గురించి వివరాలు సేకరిస్తున్నారని తెలిసింది. పరమేశ్వర్ కు చెందిన బెంగళూరు నగరంలోని సదాశివనగర్ లోని ఇంటిలో రూ. 70 లక్షలు ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆ నగదు ఎక్కడిది ?
ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ. 70 లక్షలకు డాక్టర్ జీ. పరమేశ్వర్ సరైన వివరాలు, ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చింది అనే సమాచారం ఇవ్వడంలో విఫలం అయ్యారని తెలిసింది. బెంగళూరు నగరంతో పాటు డాక్టర్ జీ. పరమేశ్వర్ కు చెందిన తుమకూరులోని సిద్దార్థ విద్యా సంస్థల మీద ఈడీ అధికారులు దాడులు చేశారు.
పరమేశ్వర్ విచారణ !
డాక్టర్ జీ. పరమేశ్వర్ ఇల్లు, విద్యా సంస్థల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు పూర్తి అయ్యాయి. మంగళవారం బెంగళూరు నగరంలోని ఐటీ శాఖ కార్యాలయంలో డాక్టర్ జీ. పరమేశ్వర్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఐటీ శాఖ కార్యాలయానికి ఈడీ అధికారులు వెళ్లి వివరాలు సేకరించడంతో డాక్టర్ జీ. పరమేశ్వర్ అనుచరులు ఆందోళనకు గురైనారు.
పీఏ ఆత్మహత్య
ఐటీ శాఖ అధికారులు దాడులు చేసిన తరువాత డాక్టర్ జీ. పరమేశ్వర్ పర్సనల్ సెక్రటరీ (పీఏ) రమేష్ ను విచారణ చేశారు. ఐటీ శాఖ అధికారుల ప్రశ్నలకు తాను సమాధానం చెప్పలేకపోతున్నానని స్నేహితులకు ఫోన్ చేసి ఆరోపించిన రమేష్ శనివారం బెంగళూరు యూనివర్శిటీ సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.