సీఎం కుమారస్వామి సోదరుడు, మంత్రి రేవణ్ణకు ఐటీ శాఖ షాక్, సోదాలు, నేను చూస్తాను, సీఎం ఫైర్!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సోదరుడు, ఆ రాష్ట్ర ప్రజాపనుల శాఖా మంత్రి హెచ్.డి. రేవణ్ణకు ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) ఊహించని షాక్ ఇచ్చింది. గురువారం మంత్రి హెచ్.డి. రేవణ్ణకు చెందిన హాసన్ లోని ఇల్లు కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు ముమ్మరం చేస్తున్నారు.
హాసన్ లోని ప్రజాపనుల శాఖ కార్యాలయంలో సోదాలు చేస్తున్న ఆదాయపన్ను శాఖ అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. హాసన్ ఇంజనీరు మంజునాథ్ ను ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు.
ప్రజాపనుల శాఖకు చెందిన అనేక కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న ఆదాయపన్ను శాఖ అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మంత్రి రేవణ్ణ నిర్వహిస్తున్న ప్రజాపనుల శాఖలో అనేక అక్రమాలు జరిగాయని అధికారులు అనుమానిస్తున్నారు.
ఇప్పటికే మంత్రి సీఎస్. పుట్టరాజు స్వగ్రామం చినకురళిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. మైసూరు నగరంలోని విజయనగరలో నివాసం ఉంటున్న మంత్రి సీఎస్. పుట్టరాజు అన్న కుమారుడు అశోక్ ఇంటిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.
బెంగళూరు నగరంలో దాదాపు 10 మంది ప్రముఖ వ్యాపారుల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. జేడీఎస్ పార్టీ మద్దతుదారుల నివాసాల్లో దాడులు చేసి ఎంత మొత్తంలో నగదు ఎత్తుకు వెలుతారో తాను చూస్తానని, తరువాత చెయ్యవలసింది చేస్తానని సీఎం కుమారస్వామి హెచ్చరిస్తున్నారు.