రేపు ఉప ఎన్నికల పోలింగ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సినిమా చూపించిన ఐటీ శాఖ, డబ్బు, మద్యం ? !
బెంగళూరు/హావేరి: కర్ణాటకలో డిసెంబర్ 5వ తేదీ గురువారం 15 శాసన సభ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉప ఎన్నికల పోలింగ్ జరిగే ఒక్క రోజు ముందు ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు కర్ణాటకలో సోదాలు ముమ్మరం చేశారు. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఐటీ శాఖ అధికారులు సినిమా చూపిస్తున్నారు. ఉప ఎన్నికల సందర్బంగా ఓటర్లకు భారీ మొత్తంలో నగదు, మద్యం, విలువైన వస్తువులు పంపిణి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం రావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంటిలో, ఆయన కార్యాలయాలు, అనుచరుల ఇండ్లలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీ శాఖ దాడులతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు హడలిపోయారు.
ప్రభుత్వ క్వాటర్స్ లో యువతిపై గ్యాంగ్ రేప్, మాజీ పోలీసు అరాచకం, కారులో ఎత్తుకెళ్లిన కామాంధులు!
అర్దరాత్రి సోదాలు
హావేరి జిల్లాలోని రాణేబెన్నూరు తాలుకాలో మంగళవారం అర్దరాత్రి దాటిన తరువాత ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు మొదలు పెట్టారు. రాణేబెన్నూరు శాసన సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేబీ. కోళివాడకు చెందిన ఆరవ క్రాస్ లోని ఇంటిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీ శాఖ సోదాల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేబీ. కోళివాడ ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఐటీ సోదాల్లో ఏం చిక్కింది ?
హుబ్బళి నుంచి రాణేబెన్నూరు పట్టణానికి వెళ్లిన ఐటీ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేబీ. కోళివాడ ఇంటిలో సోదాలు ముమ్మరం చేశారు. సోదాల్లో నగదు, మద్యం, విలువైన వస్తువులు ఏమైనా చిక్కాయా ? అనే విషయం చెప్పడానికి ఐటీ శాఖ అధికారులు నిరాకరించారు. ఐటీ శాఖ అధికారులతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు సోదాలు చేశారని వెలుగు చూసింది.
బీజేపీ, హోం మంత్రి ప్లాన్!
కర్ణాటక హోం శాఖా మంత్రి బసవరాజ్ బోమ్మయ్, కర్ణాటక ప్రభుత్వం (బీజేపీ) ఒత్తిడి చెయ్యడం వలనే తమ పార్టీ నాయకుడు కేబీ. కోళివాడ ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతాం అనే భయంతో ఐటీ శాఖ అధికారులను అడ్డం పెట్టుకుని మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపించారు.
రేపు ఉప ఎన్నికల పోలింగ్
రాణేబెన్నూరు శాసన సభ ఉప ఎన్నికల పోలింగ్ గురువారం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాణేబెన్నూరు శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి అరుణ్ కుమార్ పూజారి, కాంగ్రెస్ పార్టీ నుంచి కేబీ. కోళివాడ, జేడీఎస్ నుంచి మల్లికార్జునప్ప హలగేరితో పాటు మొత్తం 9 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. రాణేబెన్నూరులో మొత్తం 2,33,137 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కు ఒక్కరోజు ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేబీ. కోళివాడ ఇంటిలో ఐటీ శాఖ సోదాలు జరగడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు హడలిపోతున్నారు.